రాష్ట్రంలో మరో 10 రోజుల పాటు లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. లాక్ డౌన్ ను విధించడంతో కరోనా కేసులను కొంత వరకు అరికట్టవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా నగర ప్రజలకు సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ తీవ్ర హెచ్చరికలను జారీ చేశారు.
లాక్ డౌన్ సమయంలో ఏ ఒక్కరూ అనవసరంగా రోడ్లపైకి రాకూడదని..నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సీపీ సజ్జనార్. ఇవాళ(సోమవారం) ఆయన కూకట్ పల్లి, జేఎన్టీయూ చెక్ పోస్ట్, వై జంక్షన్, సనత్ నగర్, బాలానగర్ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
GHMC ఏరియాలో పెట్రోల్ బంకులు కూడా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే తెరిచి ఉంటాయని చెప్పారు. భూముల రిజిస్ట్రేషన్లకు వెళ్లేవారు స్లాట్ బుక్ చేసుకోవాలని.. రోడ్లపై పోలీసులకు వాటిని చూపించాలని తెలిపారు. పోలీసులకు అందరూ సహకరించాలని కోరారు.
