మాస్టర్​ప్లాన్​పై నిరసనలు ఎందుకంటే..

మాస్టర్​ప్లాన్​పై నిరసనలు ఎందుకంటే..

కామారెడ్డి మున్సిపాలిటీ కొత్త మాస్టర్​ ప్లాన్ ప్రపోజల్స్​పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కామారెడ్డి టౌన్, విలీన గ్రామాలు అడ్లూర్​, అడ్లూర్​ఎల్లారెడ్డి,  టెకిర్యాల్​, ఇల్చిపూర్​, దేవునిపల్లి, లింగాపూర్​, సరంపల్లి,  పాతరాజంపేట, రామేశ్వర్​పల్లి  కలుపుకొని  61.5 చదరపు కిలోమీటర్ల పరిధికి సంబంధించి ఢిల్లీకి చెందిన ఒక కన్సల్టెన్సీ  మాస్టర్​ ప్లాన్​రూపొందించగా..  డ్రాఫ్ట్​రిలీజ్​ చేసిన అధికారులు  2023 జనవరి 11 వరకు అభ్యంతరాలు చెప్పుకునేందుకు అవకాశం ఇచ్చారు.  

ప్లాన్​లో  ఇక్కడ  8.5 శాతం ఏరియా  1,200 ఎకరాల భూమిని ఇండస్ట్రీయల్​ కింద  ప్రతిపాదించారు. ఇందులో దాదాపు 900 ఎకరాలు నేషనల్​ హైవే పక్కన..  టౌన్​ కు దగ్గరగా ఉన్న భూములే ఉన్నాయి. ఇందులో ఎక్కువగా పచ్చని పంటలు పండే అడ్లూర్​, ఇల్చిపూర్​, టెకిర్యాల్​, అడ్లూర్​ ఎల్లారెడ్డి గ్రామాలకు చెందిన భూములుండడంతో ఆయా గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. ఇండస్ట్రియల్​ జోన్​లో ఇండ్ల నిర్మాణానికి పర్మిషన్​ రాదని,  నిర్మాణాలకు బ్యాంకులు లోన్లు కూడా ఇవ్వవని, ఫలితంగా భూముల విలువ తగ్గుతాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఎవరినీ సంప్రదించకుండా.. తమకు చెప్పకుండా మాస్టర్​ ప్లాన్​ ఎలా తయారు చేస్తారంటూ  రైతులు నిలదీస్తున్నారు.  100 ఫీట్ల రోడ్డు ప్రతిపాదన మీదా రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. 

రూలింగ్​ పార్టీ లీడర్ల వెంచర్లకు ఉపయోగపడేలా ఈ రోడ్డు ప్రపోజ్​ చేశారని, దీని వల్ల తమ విలువైన భూములు పోతాయని అంటున్నారు. లింగాపూర్​, దేవునిపల్లి, అడ్లూర్​,  ఇల్చిపూర్​, టెకిర్యాల్​, అడ్లూర్​ ఎల్లారెడ్డి రైతులు ఐక్య కార్యాచరణ కమిటీగా  ఏర్పడి ఆందోళన ప్రారంభించారు. మున్సిపాలిటీలో,  కలెక్టరేట్​లో రాతపూర్వకంగా 300 వరకు  అభ్యంతరాలను ఇచ్చారు. మున్సిపల్​ ఆఫీసు ఎదుట ధర్నా, కమిషనర్​, టౌన్​ ప్లానింగ్​ ఆఫీసర్ల ఘెరావ్​, ఎమ్మెల్యే గంప గోవర్ధన్​ ఇంటి  ముట్టడి, భిక్షాటన  వంటి నిరసన కార్యక్రమాలు  చేపట్టారు.  శుక్రవారం నుంచి మున్సిపల్​ ఆఫీసు ఎదుట నిరసన దీక్షలు చేస్తున్నారు.  అడ్లూరు ఎల్లారెడ్డి రైతు రాములు అత్మహత్య చేసుకోగా బుధవారం డెడ్​బాడీలో ఆందోళన చేసిన రైతులు.. గురువారం రైతులు కామారెడ్డిని ముట్టడించారు.