మద్యం మత్తులో వ్యక్తి హత్య

మద్యం మత్తులో వ్యక్తి హత్య

స్నేహితులే హతమార్చారా..?
నిందితుల కోసం పోలీసుల గాలింపు

చందానగర్, వెలుగు: మద్యం మత్తులో స్నేహితుల మధ్య తలెత్తిన గొడవలో ఓ వ్యక్తి తలపై ఇనుప రాడ్డులో బలంగా కొట్టి హత్య చేశారు. ఈ సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపల్లి ఓల్డ్​ఎంఐజీలో ఫ్లాట్ నెంబర్1879లోని రామ్​జీ ఇంట్లో అదే ప్రాంతానికి చెందిన రాజశేఖర్​రెడ్డి(43), సిద్దు, షాకీర్, రామ్​జీ కలిసి మద్యం సేవించారు. అర్ధరాత్రి సమయంలో రామ్​జీ నిద్ర పోయిన తర్వాత రాజశేఖర్​రెడ్డి, సిద్దు, షాకీర్​మద్యం తాగుతూనే ఉన్నారు. తాగిన మత్తులో సిద్దు, షాకీర్​లు కలిసి రాజశేఖర్​రెడ్డి తలపై ఇనుపరాడ్డుతో బలంగా కొట్టి హత్య చేశారు.

మంగళవారం సాయంత్రం రామ్ జీ నిద్ర నుంచి లేచి చూసేసరికి రాజశేఖర్​రెడ్డి రక్తపుమడుగులో పడి ఉండడంతో వెంటనే చందానగర్​ పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న ఇన్​స్పెక్టర్​ రవీందర్​ క్లూస్​టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. అయితే రాజశేఖర్​రెడ్డికి భార్య విడాకులు ఇవ్వడంతో అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నాడు. రామ్​జీకి అతని భార్య విడాకులు ఇవ్వడంతో ఒంటరిగా ఉంటున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. త్వరలోనే  నిందితులను పట్టుకుంటామని సీఐ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవీందర్​ తెలిపారు.