హైదరాబాద్ శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్  శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య

మేడిపల్లి, వెలుగు: పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వనపర్తి టౌన్​కు చెందిన బీరయ్య కుమార్తె వర్ష(17) ఇంటర్ ఫస్టియర్ చదువుతూ కాలేజీ హాస్టల్ లో ఉంటోంది. గురువారం ఉదయం బాత్రూంలోకి వెళ్లి ఉరేసుకుంది. సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్ బాడీని గాంధీ ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాననే మానసిక ఒత్తిడితోనే వర్ష ఆత్మహత్య చేసుకున్నట్లు కాలేజీ మేనేజ్ మెంట్ తెలిపింది. 

కానీ, బాగా చదవాలంటూ శ్రీ చైతన్య విద్యాసంస్థల డీన్ ఒత్తిడి చేయడం వల్లే ప్రెజర్ ను తట్టుకోలేక  వర్ష సూసైడ్ చేసుకుందని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు కాలేజీ ఎదుట ఆందోళన చేపట్టాయి. విద్యార్థిని మృతికి బాధ్యత వహిస్తూ డీన్ మమతను ఉద్యోగం నుంచి తొలగించాలని, బాధిత కుటుంబానికి శ్రీచైతన్య విద్యాసంస్థల మేనేజ్ మెంట్ రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని టీవీఎస్ విద్యార్థి సంఘం నాయకులు హరీశ్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. ఘటనపై ఇంటర్మీడియట్ బోర్డు కమిటీ వేసి తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు.