- సునీల్ డెడ్బాడీని చూసి గుండెలు బాదుకున్న కుటుంబసభ్యులు, తండావాసులు
- రాంసింగ్ తండాలో ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు
- అర్ధరాత్రి 11 దాకా అంబులెన్స్లోనే డెడ్బాడీ
- రూ. 5 లక్షలు, డబుల్ బెడ్రూం ఇల్లు, ఉద్యోగం ఇస్తామని ఆఫీసర్ల హామీ
- లీడర్లను బలవంతంగా తరలించిన పోలీసులు
- సర్కారు తీరుపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
మహబూబాబాద్/గూడూరు, వెలుగు: ‘ఎవుసం పనులు, కూలినాలి చేసి కష్టపడి పెంచుకుంటిమి కొడుకా... గవర్నమెంట్ జాబ్ కొడుతనని వెళ్లి శవమై వచ్చినవా బిడ్డా..’ అని బోడ సునీల్ తల్లిదండ్రులు బోడ మల్లిక, రాంధన్ గుండెలవిసేలా రోదించారు. శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ నిమ్స్లో సునీల్ చనిపోగా.. డెడ్బాడీని పోలీసులు హైడ్రామా నడుమ సాయంత్రం 5 గంటలకు మహబూబాబాద్ జిల్లా గుండెంగ శివారులోని ఆయన స్వగ్రామం తేజావత్ రాంసింగ్ తండాకు తీసుకువచ్చారు. ఏడు పోలీస్ వాహనాలు వెంటరాగా, అంబులెన్స్లో వచ్చిన డెడ్బాడీని చూసి కుటుంబ సభ్యులతో పాటు, తండా వాసులు గుండెలు బాదుకున్నారు. సునీల్ది ప్రభుత్వ హత్యేనని, ఇందుకు మూల్యం చెల్లించాలని డిమాండ్ చేశారు.
వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి
రాష్ట్ర ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్లు జారీ చేయడం లేదని, ప్రభుత్వ ఉద్యోగుల వయస్సు 61 ఏండ్లకు పెంచిందని తీవ్ర మనస్తాపానికి గురైన సునీల్ మార్చి 26న కేయూ వద్ద పురుగుల మందు తాగి సూసైడ్ అటెమ్ట్ చేశాడు. తొలుత ఎంజీఎంలో ట్రీట్మెంట్ అందించగా.. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. అక్కడ ట్రీట్మెంట్పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున ప్రాణాలు విడిచాడు.
తండాలో ఉద్రిక్తత
సునీల్ కుటుంబానికి ప్రభుత్వం రూ. కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని తేజావత్ రాంసింగ్ తండా వాసులు డిమాండ్ చేశారు. డెడ్బాడీని స్వగ్రామానికి తీసుకువస్తున్నారన్న విషయం తెలుసుకొని రాజకీయ పార్టీల నేతలు, నిరుద్యోగులు, స్టూడెంట్లు, బంధువులు, చుట్టు పక్కల తండా వాసులు రాంసింగ్ తండాకు చేరుకున్నారు. సునీల్ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేసే వరకు అంబులెన్స్ నుంచి డెడ్బాడీని దించేది లేదన్నారు. వీరికి బీజేపీ స్టేట్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు జాటోతు హుస్సేన్ నాయక్, బీజేపీ రాష్ట్ర నాయకుడు రాకేష్ రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, తెంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్ గౌడ్, ప్రజాసంఘాల నేతలు, స్టూడెంట్స్ మద్దతు పలుకుతూ ఆందోళనలో పాల్గొన్నారు. కలెక్టర్ రావాలని, బాధిత కుటుంబానికి రూ. కోటి నగదు, ఒకరికి సర్కారు ఉద్యోగం ప్రకటించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం రాత్రి 9 గంటలకు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ప్రభుత్వం నుంచి లక్ష నగదు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు. కుటుంబీకులు, స్థానికులు అంగీకరించలేదు. దీంతో లీడర్లను, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లను పోలీసులు బలవంతగా వెహికల్స్లో తరలించారు. రూ. 5 లక్షల నగదు, డబుల్ బెడ్రూం ఇల్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని ఆర్డీవో కొమురయ్య హామీ ఇచ్చారు. అర్ధరాత్రి 11 గంటల ప్రాంతంలో అంబులెన్స్ నుంచి డెడ్బాడీని కిందికి దించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. సునీల్ మృతదేహానికి ఎస్పీ కోటిరెడ్డి నివాళులర్పించారు.
సునీల్ మృతి బాధాకరం: ఎంపీ మాలోత్ కవిత
సునీల్ సూసైడ్ చేసుకోవడం బాధాకరమని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. యువత క్షణికావేశంలో ప్రాణాలను తీసుకోవద్దని ఎస్పీ కోటిరెడ్డి కోరారు.
ఇష్టమున్న రూట్లలో డెడ్బాడీని తిప్పిన పోలీసులు
హైదరాబాద్లోని నిమ్స్ లో శుక్రవారం తెల్లవారుజామున సునీల్ మృతి చెందగా.. పోలీసులు గాంధీ హాస్పిటల్కు పోస్టుమార్టం కోసం తీసుకెళ్లారు. అక్కడ పోస్టుమార్టం తర్వాత డెడ్బాడీని సునీల్ స్వగ్రామం తేజావత్ రాంసింగ్ తండాకు తరలింపులో హైడ్రామాకు తెరలేపారు. ముందు, వెనుక ఏడు పోలీస్ వాహనాలు వెంటరాగా, అంబులెన్స్లో ఉన్న కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వకుండా ఇష్టమొచ్చిన రూట్లో వెహికల్స్ను తిప్పారు. హైదరాబాద్ నుంచి నకిరేకల్ మీదుగా మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ నుంచి కురవి, అక్కడి నుంచి మహబూబాబాద్, కేసముద్రం, నాగారం బైపాస్ రోడ్డు నుంచి రాంసింగ్ తండాకు సాయంత్రం 5 గంటలకు తరలించారు. మెయిన్రోడ్డును వదిలి కేసముద్రం నుంచి ఊళ్ల మీదుగా తండాకు తేవడంపై స్టూడెంట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.