మంత్రిని అడ్డుకున్న స్టూడెంట్స్ యూనియన్లు

మంత్రిని అడ్డుకున్న స్టూడెంట్స్ యూనియన్లు
  • వైన్ షాపులొద్దు...జాబ్స్ కావాలె
  • జాబ్స్ నోటిఫికేషన్లు ఎప్పుడిస్తరని నిలదీత

మహబూబ్​నగర్​/ పాలమూరు, వెలుగు: రాష్ట్రంలో జాబ్స్ లేక నిరుద్యోగులు సూసైడ్ చేసుకుంటున్నారని, నోటిఫికేషన్లు ఇవ్వకుండా ప్రభుత్వం లిక్కర్​ షాపులకు అనుమతులు ఇవ్వడం ఏంటని  రాష్ర్ట ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను ఎస్ఎఫ్ఐ, గిరిజన విద్యార్ధి సంఘాల నేతలు నిలదీశారు.  ప్రభుత్వం ఆమ్దాని పెంచుకునేందుకే వైన్స్ షాపులు తెరుస్తోందని ఆరోపించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి తిరిగివెళ్తున్న మంత్రిని స్టూడెంట్​ లీడర్లు అడ్డుకున్నారు. పీజీలు, డబుల్​ పీజీలు చేసి..  వేలాది మంది నిరుద్యోగులు జాబ్స్, ఉపాధి లేక నిరాశతో ఉన్నారన్నారు. తమ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, గౌడ్​లకు వైన్స్ షాపుల్లో  రిజర్వేషన్లు ఇస్తోందని మంత్రి చెప్పగా..  వైన్స్ షాపుల్లో రిజర్వేషన్లు ఎవరు అడిగారని నిలదీశారు. ఖాళీలు భర్తీ చేస్తామని ప్రకటించి 7 నెలలైనా ఇప్పటికీ ఒక్క నోటిఫికేషన్​ ఇవ్వలేదన్నారు.
లిక్కర్​ షాపుల రిజర్వేషన్లు ఖరారు
దేశంలో ఎక్కడా లేని విధంగా  రాష్ర్టంలో లిక్కర్​షాపుల కేటాయింపుల్లో  రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్టు ఎక్సైజ్​ శాఖ మంత్రి వి. శ్రీనివాస్​గౌడ్​చెప్పారు. మహబూబ్​నగర్​ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, గౌడ్​ లకు కేటాయించాల్సిన లిక్కర్​ షాపులను లాటరీ ద్వారా ఎంపిక చేశారు. కలెక్టరేట్​లో సోమవారం నిర్వహించిన లాటరీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. రాష్ర్టంలో గౌడ, ఎస్సీ, ఎస్టీలు ఆర్థికంగా బలపడేందుకు  మద్యం షాపులను   కేటాయిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని 2,620 వైన్స్​ షాపుల్లో గౌడ్​లకు 15 శాతం కోటాగా  36 3,  ఎస్సీలకు పది శాతం కింద 262, ఎస్టీలకు ఐదు శాతం కింద 131 షాపులు కేటాయించినట్లు చెప్పారు. మహబూబ్​నగర్​ జిల్లాలో  90 వైన్స్ షాపులకు గాను గౌడ్​లకు  14, ఎస్సీలకు 10, ఎస్టీలకు 3  కేటాయించినట్లు చెప్పారు. గతంలో షాపులు తీసుకున్నవారు  రెండు బ్యాంకు గ్యారంటీలు ఇవ్వాల్సిఉండేదని,  ఈసారి ఒకగ్యారంటీ ఇస్తే చాలని చెప్పారు.  గతంలో ఒకరు ఒకే షాపు తీసుకునే వీలుండేదని,  ఇప్పుడు ఆ పరిమితి లేదన్నారు.  రాష్ట్రంలో గుడుంబా తయారీ, గంజాయి సాగు, రవాణా, కల్తీ మద్యాన్ని పూర్తిగా అరికడతామని చెప్పారు. ఈ కార్యక్రమం తర్వాత మంత్రి జిల్లాలో కొత్తగా నియమించిన 23 మంది ఏఎన్ఎంలకు అపాయింట్​మెంట్​ లెటర్లు ఇచ్చారు.  కార్యక్రమంలో  కలెక్టర్ ఎస్.వెంకట్రావు,  అడిషనల్​కలెక్టర్లు తేజస్ నందలాల్ పవర్, కె.సీతా రామారావు, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఖురేషి, సీఐ బాలకృష్ణ  తదితరులు పాల్గొన్నారు.