సికింద్రాబాద్, వెలుగు: ప్రభుత్వ స్పోర్ట్స్ బిల్డింగ్ లకు ప్రభుత్వమే కరెంటు కట్ చేయడం ఏంటని బీజేవైఎం సిటీ ప్రెసిడెంట్ మద్దూరు శివాజీ ప్రశ్నించారు. ఓయూలోని సైక్లింగ్ స్టేడియం స్పోర్ట్స్ హాస్టల్లో 20 రోజుల నుంచి కరెంట్, వాటర్ లేక స్టూడెంట్లు ఇబ్బందులకు గురవుతున్నా అధికారులు స్పందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం స్పోర్ట్స్ హాస్టల్ను సందర్శించిన ఆయన అక్కడి ఇబ్బందుల గురించి స్టూడెంట్లను అడిగి తెలుసుకున్నారు. కరెంట్ లేకపోవడంతో క్యాండిల్స్తో నిరసన తెలిపారు. అనంతరం కరెంట్, వాటర్ సమస్యలపై హాస్టల్ వార్డెన్ను నిలదీశారు.
శివాజీ మాట్లాడుతూ.. రాష్ట్రం, దేశం కోసం ఆడుతున్న క్రీడాకారులకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ మండిపడ్డారు. క్రీడాకారులకు సరైన వసతులు కల్పించాల్సింది పోయి.. స్పోర్ట్స్ కాంప్లెక్స్లకు కరెంట్ బిల్లులు కట్టక, పవర్ కట్ అయిపోతే స్పోర్ట్స్ అథారిటీ అధికారులు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కరెంట్ బకాయిలను క్లియర్ చేయాలన్నారు. లేకపోతే క్రీడా శాఖ మంత్రి ఇంటిని, ప్రగతి భవన్ను ముట్టడిస్తామని హెచ్చరించారు.ఆందోళనలో బీజేవైఎం అధికార ప్రతినిధి బుర్ర రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.