- ఏటా హరిత నిధికి స్టూడెంట్లు విరాళమియ్యాలె
- జీవో జారీ చేసిన రాష్ట్ర సర్కార్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ గ్రీన్ఫండ్కు స్కూల్ స్టూడెంట్ల నుంచి ఎంపీల వరకు కొంత మొత్తాన్ని వసూలు చేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఒక్కో స్కూల్ స్టూడెంట్ ఏడాదికి రూ.10, ఇంటర్ స్టూడెంట్ రూ.15, డిగ్రీ స్టూడెంట్లు రూ.25 చొప్పున, ప్రొఫెషనల్ కోర్సులు చదివే స్టూడెంట్లు ఏడాదికి రూ.100 చొప్పున, ఒక్కోఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఏడాదికి రూ.6 వేల చొప్పున ఇవ్వాలని పేర్కొంటూ శుక్రవారం జీవో జారీ చేసింది. ఆలిండియా సర్వీసెస్ ఉద్యోగులు ఏడాదికి రూ.1,200, రాష్ట్ర ప్రభుత్వ ఎంప్లాయీస్, టీచర్లు, ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్ల ఉద్యోగులు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఏడాదికి రూ.300 చొప్పున కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ఎంప్లాయీస్, ఆలిండియా సర్వీసెస్ ఉద్యోగుల మే నెల జీతం నుంచి గ్రీన్ఫండ్కు ట్రాన్స్ఫర్ చేయనున్నట్లు జీవోలో పేర్కొంది. జిల్లా పరిషత్ చైర్మన్లు, కార్పొరేషన్ల చైర్మన్ల జీతం నుంచి ఏడాదికి రూ.1,200, ఎంపీపీలు, జెడ్పీటీసీల జీతం నుంచి ఏడాదికి రూ.600, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్ల జీతం నుంచి ఏడాదికి రూ.120 చొప్పున జమ చేయనున్నారు.రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్లలో జరిగే ప్రతి రిజిస్ట్రేషన్కు రూ.50 చొప్పున, వైన్ షాపులు, బార్లు, కిరాణ షాపులు, ఇతర బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ల రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్స్కు రూ.వెయ్యి చొప్పున హరిత నిధికి కట్టాలి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు, కార్పొరేషన్లకు సంబంధించిన వర్క్ కాంట్రాక్టుల్లో 0.01% హరిత నిధికి కేటాయించాలి. నియోజకవర్గాల డెవలప్మెంట్ ఫండ్ నుంచి 10% గ్రీన్ఫండ్కే ఇవ్వాల్సి ఉంటుంది.