
ఆక్సియమ్-4 మిషన్ (లేదా యాక్స్-4) స్పేస్ ఎక్స్, నాసా, ఆక్సియమ్ స్పేస్లు సంయుక్తంగా నిర్వహించే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, ఐఎస్ఎస్) చేరడానికి చేపట్టిన యాత్ర ప్రారంభమైంది. క్రూ డ్రాగన్ అంతరిక్ష నౌకలో నలుగురు నిష్ణాతులైన కమాండర్ లతో శుక్లా పయనిస్తున్నారు. భారత దేశపు మానవ అంతరిక్ష ప్రయాణ కార్యక్రమానికి యూక్స్-4 ఒక మైలురాయిని సూచిస్తున్నది. ఇస్రో గగన్యాన్ చొరవతో అనుసంధానించబడిన ఈ మిషన్లో భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా - ఐఎస్ఎస్కు వాణిజ్య మిషన్లో ప్రయాణిస్తున్న తొలి వ్యక్తిగా రికార్డు నెలకొల్పనున్నారు.
ఆక్సియమ్-4 మిషన్ ఇండియన్ ఎయిర్పోర్స్లో గ్రూప్ కెప్టెన్గా విశేష సేవలు అందిస్తున్న శుభాంశు శుక్లా స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్లో ఆక్సియమ్-4 మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. గత నాలుగు దశాబ్దాల్లో అంతరిక్ష యాత్ర చేయనున్న తొలి భారతీయుడిగా శుక్లా వెళ్లడం, మన అంతరిక్ష చరిత్రలో మరో మైలురాయిగా నిలవనుంది.
అంతరిక్ష యాత్ర వాతావరణ ప్రతికూలాల మూలంగా కొన్ని రోజులు వాయిదా పడింది. ఇపుడు ఎట్టకేలకు ప్రారంభమైంది.ఆక్సియమ్-4 మిషన్లో వెళుతున్న వ్యోమగాములు నలుగురు కనీసం రెండు వారాల పాటు పలు పరిశోధనలు చేయనున్నారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో చేయనున్న ఆక్సియమ్-4 మిషన్ ప్రయోగంలో శుభాంశు ప్రయాణానికి భారత్ కూడా దాదాపు 60 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నది.
శుభాంశు శుక్లా ఎవరు..?
10 అక్టోబర్ 1985న లక్నోలో జన్మించిన శుభాంశు శుక్లా అలీగంజ్లోని సిటీ మాంటెస్సొరీ పాఠశాలలో చదివిన అనంతరం కార్గిల్ యుద్ధం నుంచి ప్రేరణ పొంది నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరి కంప్యూటర్ సైన్స్లో పట్టా పొందారు. 2006లో ఇండియన్ ఎయిర్ఫోర్స్లో కమీషన్డ్ ఆఫీసర్గా చేరి 2000 గంటల గగనయాన అనుభవాన్ని పొందారు. సూ-30 ఎంకెఐ, మిగ్-29 జాగ్వార్, డోమియర్-228, హాక్ ఎయిర్క్రాఫ్ట్లను నడిపిన అనుభవాన్ని పొందారు.
ఐఐఎస్సి బెంగళూరులో ఏరోస్పేస్ ఇంజినీరింగ్లో ఎంటెక్ పూర్తి చేసిన శుభాంశు 2019లో గగన్యాన్ మానవ సహిత వ్యోమనౌక మిషన్కు ఎంపికైనారు. ఇస్రో -బెంగళూరు, గగారిన్ కాస్మొనాట్ ట్రైనింగ్సెంటర్ - రష్యాల్లో శిక్షణ పొందిన శుభాంశు శుక్లా 2024లో ఆక్సియమ్-4 మిషన్లో పైలెట్గా ఎంపికైనారు. 41 ఏండ్ల క్రితం 1981లో అంతరిక్షంలో సూయజ్ స్పేస్క్రాఫ్ట్లో ఎనిమిది రోజులు ప్రయాణించిన రాకేష్ శర్మ తర్వాత అంతరిక్ష యాత్ర చేస్తున్న రెండవ వ్యోమగామిగా శుక్లా పేరు తెచ్చుకుంటున్నారు.
ఈ సందర్భంగా శుభాంశు మాట్లాడుతూ 1.4 బిలియన్ల భారతీయుల ప్రతినిధిగా అంతరిక్ష ప్రయాణం చేస్తున్నానని, నా యాత్ర కొద్ది మంది యువతకు ప్రేరణగా నిలిచినా లేదా ఒక్కరి జీవితాన్ని మార్చినా ఈ యాత్ర సఫలం అయినట్లే అని స్పష్టం చేయడం హర్షదాయకం, అనుసరణీయం, అభినందనీయం. ఇండియా, పోలాండ్, హంగేరీ దేశాలకు చెందిన ఒక్కొక్క వ్యోమగామి పాల్గొంటున్న ఆక్సియమ్-4 మిషన్ ద్వారా తక్కువ ఎత్తున ఉన్న భూకక్ష్యలో చేరుకుంది. వారి అంతరిక్ష యాత్ర సఫలం కావాలని, భారత్ భవిష్యత్తులో స్వయంగా అంతరిక్ష యాత్రలు చేపట్టాలని, సాంకేతిక రంగంలో భారత్ మరింత ముందుకు దూసుకుపోవాలని ఆశిద్దాం.
- డా: బుర్ర
మధుసూదన్ రెడ్డి