ఆర్మీ, పారా మిలటరీ దళం ‘ఆర్ఎస్ఎఫ్’​ మధ్య ఆధిపత్య పోరు 

ఆర్మీ, పారా మిలటరీ దళం ‘ఆర్ఎస్ఎఫ్’​ మధ్య ఆధిపత్య పోరు 

ఖర్తూమ్​ : ఇప్పటికే ఆర్థిక, ఆహార సంక్షోభాల్లో కూరుకుపోయిన సూడాన్ ను ఇప్పుడు సైనిక సంక్షోభం వణికిస్తోంది. సైనిక స్థావరాలపై పట్టు కోసం సూడాన్​ ఆర్మీ, పారా మిలటరీ బలగాల్లోని ర్యాపిడ్​ సపోర్ట్​ ఫోర్సెస్ (ఆర్​ఎస్​ఎఫ్)​ మధ్య శనివారం నుంచి  భీకర యుద్ధం జరుగుతోంది. దీంతో ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఇళ్లలో నుంచి బయటకు రావట్లేదు. రాజధాని ఖర్తూమ్​తో పాటు ఓందుర్​ మన్​, పశ్చిమ డార్ఫర్​ ప్రావిన్స్​, ఉత్తర డార్ఫర్ ప్రావిన్స్​, కస్సాలా ప్రావిన్స్​, అల్​ ఖదారిఫ్​ ప్రావిన్స్​లలో సూడాన్​ ఆర్మీ, ర్యాపిడ్​ సపోర్ట్​ ఫోర్సెస్ మధ్య తుపాకులు, యుద్ధ ట్యాంకులతో పోరు  జరుగుతోంది. ఈ రెండు సైనిక వర్గాలు ఒకదాని స్థావరాలను మరొకటి టార్గెట్​ చేసుకొని దాడులు చేసుకుంటున్నాయి. 

ఈ దాడుల్లో 56 మంది పౌరులు మృతిచెందగా, 600 మందికిపైగా గాయాలపాలయ్యారు. మృతుల్లో ఆల్బర్ట్​ అగస్టీన్​ అనే భారతీయుడు ఉన్నట్లు గుర్తించారు. శనివారం బుల్లెట్​ గాయాలతో అతడు మృతిచెందాడని ఖర్తూమ్​ లోని భారత ఎంబసీ ట్వీట్​ చేసింది. మృతుడి స్వస్థలం కేరళలోని కన్నూర్​ అని వెల్లడించింది. అగస్టీన్​ మృతదేహాన్ని కేరళకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొంది. ఈనేపథ్యంలో సూడాన్​లో ఉంటున్న భారతీయులు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, అప్రమత్తంగా ఉండాలని భారత ఎంబసీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. 

ఆ ప్రతిపాదన వల్లే.. 

ర్యాపిడ్​ సపోర్ట్​ ఫోర్సెస్ (ఆర్​ఎస్​ఎఫ్)​ను సూడాన్​ ఆర్మీలో విలీనం చేసేందుకు ఆర్మీ చీఫ్​ అబ్దెల్​ ఫత్తా బుర్హాన్​ చేసిన ప్రతిపాదన ఈ అంతర్యుద్ధానికి దారితీసింది.  సైన్యంలో తమ గ్రూప్​ను విలీనం చేయరాదంటూ మహ్మద్​ హమ్దాన్​ దగాలో నేతృత్వంలోని  ర్యాపిడ్​ సపోర్ట్​ ఫోర్సెస్ తిరుగుబాటు చేశాయి. మరోవైపు అంతర్గత యుద్ధాన్ని ఆపాలంటూ సూడాన్​కు అమెరికా, యూరోపియన్​ యూనియన్, అరబ్​లీగ్​, ఆఫ్రికన్​ యూనియన్​, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి విజ్ఞప్తి చేశాయి. కనీసం అంబులెన్సులు, మందుల సరఫరా వాహనాలపై దాడులు చేయకుండా సూడాన్​ ఆర్మీ, ఆర్ఎస్ఎఫ్​లను ఒప్పించాలంటూ సూడాన్ డాక్టర్ల సమాఖ్య  అంతర్జాతీయ సమాజాన్ని కోరింది.