రేపు ఆదివారం (నవంబర్ 23) భారత్ బంద్ ఎందుకంటే..

రేపు ఆదివారం (నవంబర్ 23) భారత్ బంద్ ఎందుకంటే..

 భద్రాచలం, వెలుగు: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఎన్​కౌంటర్​కు నిరసనగా నవంబర్ 23న దేశవ్యాప్త బంద్ కు పిలుపునిస్తున్నట్టు ఆ పార్టీ ప్రతినిధి అభయ్ శుక్రవారం (నవంబర్ 23) ఒక ప్రకటనలో తెలిపారు.  

నిరాయుధులైన మడవి హిడ్మా, ఆయన భార్య రాజేలతో పాటు ఆరుగురు మావోయిస్టులను ఏపీ పోలీసులు విజయవాడలో పట్టుకుని మారేడుమిల్లి అడవుల్లో కాల్చి చంపి ఎన్​కౌంటర్ కథ అల్లారని మండిపడ్డారు. 

అనార్యోగంతో ఉన్న హిడ్మా  ట్రీట్​మెంట్​కోసం విజయవాడకు వచ్చారని, విప్లవ ద్రోహి ఇచ్చిన సమాచారంతో ఎస్​ఐబీ పోలీసులు ఆయన్ను పట్టుకున్నారని పేర్కొన్నారు. ఈ నెల 15న పట్టుకుని 18న కాల్చి చంపారన్నారు.

 చత్తీస్​గఢ్​ కు చెందిన ఆదివాసీ సంఘం సీనియర్​ నాయకుడు మనీష్​ కుంజా కూడా ఎన్​కౌంటర్​పై మాట్లాడుతూ.. తాడిమెట్ల, జీరంఘాట్​ఘటనల్లో హిడ్మా ప్రమేయం లేదని, ఆంధ్రాకు చెందిన కొంత మంది పార్టీ నేతలు హిడ్మా కదలికలపై పోలీసులకు సమాచారం ఇచ్చారని మండిపడ్డారు. ఈ ఎన్​కౌంటర్​లో దేవ్​జీ పాత్ర ఉందని ఆరోపించారు.