సౌతాఫ్రికా 20 లీగ్ ఫస్ట్ సీజన్ విజేతగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి చెందిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ నిలిచింది. ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ కు చెందిన ప్రిటోరియా క్యాపిటల్స్ ను 4 వికెట్ల తేడాతో ఓడించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా క్యాపిటల్స్ 19.3 ఓవర్లలో 135 పరుగులకే ఆలౌట్ అయింది. కుశాల్ మెండీస్(21), రిలీ రోసౌ(19), జేమ్స్ నీషమ్(19) పరుగులు చేశారు. సన్రైజర్స్ బౌలర్లలో వాన్డెర్ మెర్వే 4 వికెట్లు తీసుకున్నాడు. సిసండా మగల, బార్టమాన్ 2 వికెట్ల చొప్పున పడగొట్టారు. మార్కో జాన్సెన్, ఎయిడెన్ మార్క్రమ్ తలో వికెట్ దక్కించుకున్నారు.
ఆ తర్వాత 136 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ 16.2 ఓవర్లలోనే 137 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ ఆడమ్ రోసింగ్టన్ 30 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 57 పరుగులు చేశాడు. కెప్టెన్ మార్క్రమ్(26), జోర్డాన్ హెర్మాన్(22) పరుగులతో రాణించారు. చివర్లో మార్కో జాన్సెన్ 13 నాటౌట్ గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. క్యాపిటల్స్ బౌలర్లలో అన్రిచ్ నోర్జ్ 2 వికెట్లు పడగొట్టాడు. ఈథన్ బోచ్, ఆదిల్ రషీద్, కొలిని్ ఇంగ్రామ్, జేమ్స్ నీషమ్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ టోర్నీలో 366 పరుగులు 11 వికెట్లతో రాణించిన మార్క్రమ్కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది.