
తిరుమల లడ్డు కేసులో సిట్ దర్యాప్తుపై కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. ఈ కేసులో సిట్ దర్యాప్తు ఆపేసిందా అని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. శుక్రవారం ( సెప్టెంబర్ 26 ) తిరుమల లడ్డు కేసులో సీబీఐ పిటిషన్ విచారణ సందర్భంగా ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్. తిరుమల లడ్డు కేసులో సిట్ వేరొక అధికారిని అధికారాలు బదలాయించడం సరికాదని పేర్కొన్న గవాయ్.. ఈ కేసులో సిట్ పని చేయడం ఆపేసిందా అంటూ ప్రశ్నించారు.
చిన్నప్పన్నకు సిట్ లో లేని అధికారి నోటీసు ఇవ్వడం సుప్రీంకోర్టు ఆదేశాలను అతిక్రమించడమేనని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది సీబీఐ. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన చీఫ్ జస్టిస్ గవాయ్ ధర్మాసనం ఏపీ హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు.
ఇదిలా ఉండగా.. ఈ కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. కల్తీ నెయ్యి కేసులో నిందితులుగా ఉన్న భోలే బాబా డైరీ డైరెక్టర్లు వైష్ణవి డైరీ సీఈఓ సహా పలువురికి బెయిల్ మంజూరు చేసింది కోర్టు. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన అంశంలో సుదీర్ఘ కాలంగా విచారణ జరుగుతున్న క్రమంలో జులై 3 ఈ కేసులో A3 గా ఉన్న పోమిల్ జైన్, A4 గా ఉన్న విపిన్ జైన్, A5 గా ఉన్న వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ వినయ్ కాంత్ చావడా లకు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు.
2025 ఫిబ్రవరి 9న నెయ్యి సరఫరా చేసిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది సిట్ బృందం.ఉత్పత్తి సామర్ధ్యానికి మించి ఎక్కువ మొత్తంలో నెయ్యి సరఫరా చేసేందుకు పలు ఉత్తరాది డైయిరీ సంస్థల నుంచి నెయ్యి కొనుగోలు చేసినట్లు గుర్తించిన సీబీఐ.. సుదీర్ఘ విచారణ తర్వాత ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, పరాగ్ డైయిరీ, ఆల్ఫా మిల్క్ ఫుడ్స్, ఏఆర్ డైయిరీకి సంబంధించిన విపిన్ గుప్త, పోమిల్ జైన్, అపూర్వ చావడ, రాజశేఖర్లను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టింది.