రిషికొండ కేసు విచారణ: సీఎం అక్కడికి వెళ్లొద్దా ... చురకలు అంటించిన సుప్రీంకోర్టు

రిషికొండ కేసు విచారణ: సీఎం అక్కడికి వెళ్లొద్దా ... చురకలు అంటించిన  సుప్రీంకోర్టు

రిషికొండపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. అయితే, టీడీపీ నేత లింగమనేని శివరామ ప్రసాద్‌కు అత్యున్నత న్యాయస్థానంలో ఎదురు దెబ్బ తగిలింది. రుషికొండ నిర్మాణాల అంశంపై ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై.చంద్రచూడ్ స్పష్టం చేసారు..  అక్కడకు సీఎం వెళ్లవద్దా.. క్యాంపు కార్యాలయాలు నిర్మించుకోవద్దా అంటూ వ్యాఖ్యానించడంతోపాటు... సుప్రీంకోర్టు అనేది రాజకీయాలకు వేదిక కాదు అని అంటూ చురకలు అంటించారని తెలుస్తుంది.

సీఎంను రుషికొండకు వెళ్లవద్దని అంటున్నారు.. ఇందులో ప్రజా ప్రయోజనం ఏం ఉంది.. రాజకీయ కారణాలు కన్పిస్తున్నాయని వ్యాఖ్యానించింది ధర్మాసనం.. రాజకీయాలకు ఇది వేదిక కాదని పేర్కొంది. హైకోర్టులో, నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) వద్ద ఈ కేసు పెండింగ్ లో ఉందని గుర్తు చేసింది.. రాజకీయ కారణాలతోనే కోర్టుకు వచ్చారన్న సీజేఐ.. లింగమనేని అభ్యర్థనను తోసిపుచ్చారు..

లింగనేని పిటిషన్ వివరాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై  సుప్రీంకోర్టులో విజయవాడకు చెందిన పర్యావరణ వేత్త లింగమనేని శివరామ ప్రసాద్ పిల్ దాఖలు చేశారు. కోస్టల్ రెగ్యులేటరీ జోనుకు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో ఫైనల్ హియరింగ్ ఉండగా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి విశాఖపట్నం రుషి కొండ మీద ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, సీనియర్ అధికారుల కార్యాలయాల ఏర్పాటు కోసం ఏపీ సర్కార్ అక్టోబర్ 11, 2023న ఇచ్చిన జీవో 2015ను వెంటనే రద్దు చేయాలనీ కోరుతూ సుప్రీమ్ కోర్టులో లింగమనేని శివరామ ప్రసాద్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 48/ఏ ఉల్లంఘనలకు పాల్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యలను వెంటనే నిలువరించాలని పిటేషన్‌లో విజ్ఞప్తి చేశారు. ఎన్జీటీ, ఏపీ హైకోర్టులో ఈ విషయంపై ఉన్న కేసులు పరిష్కారం అయ్యే వరకు రుషికొండపై ఏ విధమైన నిర్మాణాలు, ప్రారంభ కార్యక్రమాలు జరుగకుండా వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని లింగమనేని శివరామ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు హైకోర్టులో రుషికొండ కేసు పెండింగ్‌లో ఉన్నందున అక్కడే పిల్ దాఖలు చేయాలని సుప్రీం ధర్మాసనం స్పందించారు.