న్యూఢిల్లీ: యోగా గురువు రామ్దేవ్, పతంజలి ఆయుర్వేద్ ఇచ్చిన హామీని ఉల్లంఘించినందుకు సుప్రీంకోర్టు మంగళవారం తీవ్రంగా మండిపడింది. ఉత్పత్తుల గురించి, వాటి ఔషధ సామర్థ్యాన్ని గురించి చెప్పుకునే ప్రకటనలను తప్పుపట్టింది. పతంజలి ఆయుర్వేద్పై, మేనేజింగ్ డైరెక్టర్పై ధిక్కార చర్యలు ఎందుకు ప్రారంభించకూడదో చెప్పాలంటూ న్యాయమూర్తులు హిమా కోహ్లీ, ఏ అమానుల్లాలతో కూడిన బెంచ్ నోటీసులు జారీ చేసింది.
గతంలో కోర్టుకు ఇచ్చిన హామీ పతంజలి ఆయుర్వేద అధికారులు ఉల్లంఘించారని స్పష్టం చేసింది. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఇతర వైద్యవిధానాలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేయవద్దని బెంచ్ గతంలోనే హెచ్చరించింది. ఇకపై ఎటువంటి చట్టాన్ని ఉల్లంఘించబోమని కంపెనీ లాయర్ గత ఏడాదే సుప్రీంకు హామీ ఇచ్చారు. తమ మందుల ప్రకటనల్లో తప్పుడు వాదనలు చేయవద్దని సుప్రీం కోర్టు హెచ్చరించింది. వ్యాక్సినేషన్ డ్రైవ్, ఇంగ్లిష్ మందులకు వ్యతిరేకంగా రామ్దేవ్ దుష్ప్రచారం చేశారని ఆరోపిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం విచారిస్తోంది.