- 28 రోజుల్లో కోర్టు ముందుకు రావాలని ఆదేశం
- ఏపీ సహా 13 మంది ప్రతివాదులకు సమన్లు.. 28 రోజుల్లో కోర్టు ముందుకు రావాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఏపీ అక్రమంగా చేపడుతున్న పోలవరం బనకచర్ల ప్రాజెక్టుపై ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రాజెక్టును ఏపీ ఆపేసేలా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి సుప్రీంకోర్టు పాజిటివ్గా స్పందించింది. మంగళవారం 13 మంది ప్రతివాదులకు సమన్లను జారీ చేసింది. 28 రోజుల్లోగా కోర్టు రిజిస్ట్రీముందు హాజరై తమ రిప్లై ఇవ్వాలని స్పష్టం చేసింది. పోలవరం బనకచర్ల ప్రాజెక్టును కట్టకుండా ఏపీని నిలువరించాలని కోరుతూ ఈ ఏడాది ఏప్రిల్ 25న సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సూట్ దాఖలు చేసింది.
ఏపీతో పాటు కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర ఆర్థిక శాఖ, కేంద్ర పర్యావరణ శాఖ, కర్నాటక, మహారాష్ట్ర, చత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, పోలవరం ప్రాజెక్ట్అథారిటీ, గోదావరి బోర్డు, కృష్ణా బోర్డు,సెంట్రల్వాటర్కమిషన్ ప్రతివాదులుగా ఆ సూట్ మంగళవారం చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. అడ్వకేట్ ఆన్ రికార్డ్తో కోర్టు ముందుకు రావాలని, పిటిషనర్కు సమాధానమివ్వాలని ప్రతివాదులకు స్పష్టం చేసింది.
కేసు విచారణకు వచ్చే నాటికి సాక్షులను సిద్ధం చేసుకోవాలని, పిటిషనర్ చేస్తున్న ఆరోపణలకు మీ దగ్గరున్న డాక్యుమెంట్లనూ సిద్ధం చేసి పెట్టుకోవాలని తెలిపింది. ఒకవేళ గడువులోగా కోర్టు ముందు హాజరుకాకుంటే.. కేసును విచారణకు తీసుకుంటామని తెలిపింది. ప్రతివాదులు గైర్హాజరు అని పేర్కొనాల్సి ఉంటుందని తెలిపింది.
