
- ఎస్బీఐకి మరోసారి డెడ్లైన్ విధించిన సుప్రీంకోర్టు
- మార్చి 21లోగా అన్ని వివరాలు ఇవ్వాలని ఆదేశం
- ఆ తర్వాత అఫిడవిట్దాఖలు చేయండి
- బ్యాంకు చైర్మన్కు సూచన
- కోర్టు ఆదేశాలను పాటించకపోవడంపై ఆగ్రహం
న్యూఢిల్లీ : ఎలక్టోరల్ బాండ్ల విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు సుప్రీంకోర్టు మరోసారి అక్షింతలు వేసింది. తమ ఆదేశాల ప్రకారం ఎన్నికల బాండ్ల నంబర్లను ఎలక్షన్ కమిషన్ (ఈసీ) కు సమర్పించకపోవడంపై అత్యున్నత న్యాయస్థానం ఫైర్ అయ్యింది. బాండ్ల నంబర్లతో సహా అన్ని వివరాలను మార్చి 21 సాయంత్రం 5గంటల లోగా ఈసీకి సమర్పించాలని ఆదేశించింది.
అనంతరం తమ బ్యాంకు ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన అన్ని వివరాలను బహిర్గతం చేసిందని, ఎలాంటి వివరాలను దాచిపెట్టలేదని సూచిస్తూ కోర్టుకు అఫిడవిట్ సమర్పించాలని ఎస్బీఐ చైర్మన్ కు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. ‘బాండ్ల విషయంలో ఎస్బీఐ సెలెక్టివ్గా ఉండకూడదు. దేన్ని అణచివేయకూడదనే ఉద్దేశంతోనే ఇందుకు సంబంధించి అన్ని విషయాలను బహిర్గతం చేయాలని మేం తీర్పుచెప్పాం’ అని సీజేఐ డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.
ఏ దాత లేదా ఏ సంస్థ ఏ రాజకీయ పార్టీకి ఎన్ని నిధులు ఇచ్చారో స్పష్టంగా తెలియాల్సిందేనని అన్నారు. ఎన్నికల బాండ్ల ఆల్ఫా న్యూమరిక్, సీరియల్ నంబర్లతోసహా అన్ని వివరాలనుఈసీకి సమర్పించాలని ఎస్బీఐని ఆదేశించారు. ఎస్బీఐ వెల్లడించిన వివరాలను వెబ్సైట్లో పెట్టాలని ఈసీకి ఆదేశాలు జారీచేశారు. ‘ఎలక్టోరల్ బాండ్స్కు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం మొత్తాన్ని వెల్లడించాలని మేం కోరుకుంటున్నాం. మీరు ఇక్కడికి రాజకీయ పార్టీల తరఫున రాలేదని భావిస్తున్నాం. ఈ కోర్టు తీర్పును పాటించాల్సిన బాధ్యత మీపై ఉంది’ అని ఎస్బీఐని ఉద్దేశించి సీజేఐ వ్యాఖ్యానించారు.
ఎస్ బీఐ తీరుపై అసహనం..
కేంద్రంలోని బీజేపీ సర్కారు తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేస్తూ ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. ఐదేండ్ల కాలంలో జారీ చేసిన బాండ్ల వివరాలను నంబర్లతోసహా ఈసీకి సమర్పించాలని అత్యున్నత న్యాయస్థానం ఎస్బీఐకి ఆదేశాలు జారీచేసింది. అయితే, ఎస్బీఐ కేవలం ఎలక్టోరల్ బాండ్ల వివరాలు మాత్రమే ఈసీకి సమర్పించి, బాండ్ల నంబర్లను వెల్లడించలేదు. ఈ వివరాలనే ఈసీ తన వెబ్సైట్లో పొందుపరిచింది. దీనిపై మరో పిటిషన్ దాఖలుకాగా, కోర్టు విచారణ చేపట్టింది. ఎస్బీఐ తీరుపై అత్యున్నత న్యాయస్థానం అసహనం వ్యక్తంచేసింది. ఈసారి కచ్చితంగా ఎలక్టోరల్ బాండ్ల నంబర్లను వెల్లడించాల్సిందేనని ఎస్బీఐని ఆదేశించింది.
సోషల్మీడియా కామెంట్లను స్వీకరించాల్సిందే: సీజేఐ
ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం విషయంలో సుప్పీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సోషల్ మీడియాలో నడుస్తున్న ప్రచారంపై సీజేఐ చంద్రచూడ్ స్పందించారు. విచారణ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ కోర్టు ముందున్నవారు ఉద్దేశపూర్వకంగా న్యాయస్థానాన్ని ఇబ్బందికి గురిచేస్తూ పత్రికా ఇంటర్వ్యూలు ఇస్తున్నారని, దీంతో కేంద్రం, ఎస్బీఐపై సోషల్మీడియాలో ప్రచారం జరుగుతోందని తెలిపారు.
దీనిపై స్పందించిన సీజేఐ.. సోషల్మీడియాలో నడుస్తున్న ప్రచారాన్ని స్వీకరించాల్సిందేనని వ్యాఖ్యానించారు. ‘న్యాయమూర్తులుగా మేం చట్టబద్ధంగా, రాజ్యాంగానికి లోబడి పనిచేస్తాం. న్యాయమూర్తులుగా మేం సోషల్మీడియాలో కూడా చర్చిస్తాం. ఒక సంస్థగా సోషల్మీడియా వ్యాఖ్యానాలనూ ఎదుర్కొంటాం’ అని వ్యాఖ్యానించారు. ఒకసారి తాము తీర్పు వెలువరించాక అది ప్రజా ఆస్తి అవుతుందని, దానిపై ఎవరైనా కామెంట్ చేయొచ్చని, దాన్ని తాము అడ్డుకోలేమని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు.
ఎలక్టోరల్ బాండ్స్కు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం మొత్తాన్ని వెల్లడించాలి. మీరు ఇక్కడికి రాజకీయ పార్టీల తరఫున రాలేదని భావిస్తున్నం. ఈ కోర్టు తీర్పును పాటించాల్సిన బాధ్యత మీపై ఉంది. బాండ్ల విషయంలో ఎస్బీఐ సెలక్టివ్గా ఉండకూడదు. ఏ దాత లేదా ఏ సంస్థ ఏ రాజకీయ పార్టీకి ఎన్ని నిధులు ఇచ్చారో స్పష్టంగా తెలియాల్సిందే. ఎన్నికల బాండ్ల ఆల్ఫా న్యూమరిక్, సీరియల్ నంబర్లతో పాటు అన్ని వివరాలను ఈసీకి సమర్పించాలి.
సుప్రీంకోర్టు