
- భూవివాదం కేసులో సీఎంపై పిటిషన్ దాఖలు చేసిన పెద్ది రాజు
- పిటిషన్లో హైకోర్టు సిట్టింగ్ జడ్జిపై పలు ఆరోపణలు
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ సిట్టింగ్ జడ్జీ పైన అసభ్యకరమైన ఆరోపణలు చేసినందుకు పిటిషనర్, ఆయన తరపు న్యాయవాదిపై ఎందుకు కోర్టు ధిక్కార చర్యలు తీసుకోకూడదో చెప్పాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జడ్జీలపై ఆధారాలు లేని ఆరోపణలను చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని పేర్కొంది. సోసైటీ స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నించారని 2016లో రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి, లక్ష్మయ్యపై గచ్చిబౌలి పీఎస్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద ఎన్ పెద్ది రాజు కంప్లైంట్ చేశారు. ఈ విషయంలో తనపై దాఖలైన కేసును కొట్టివేయాలని 2020 లో రేవంత్ రెడ్డి రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా.. పిటిషన్ పై సుదీర్ఘ వాదనల అనంతరం ఆరోపణల్లో నిజం లేదని హైకోర్టు తేల్చింది.
సరైన సాక్ష్యాధారాలు లేనందున రేవంత్ రెడ్డిపై దాఖలైన కేసును కొట్టివేసింది. అయితే.. ఈ కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ ఈ నెల 12వ తేదీన పెద్ది రాజు తరఫున ఏవోఆర్ రితేశ్ పాటిల్ సుప్రీంకోర్టులో ట్రాఫర్ పిటిషన్ (క్రిమినల్) దాఖలు చేశారు. ఈ పిటిషన్ మంగళవారం సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి తరఫున సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లూత్రా, పిటిషన్ పెద్దిరాజ్ తరఫున నితిన్ మిశ్రా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీజేఐ స్పందిస్తూ... ‘హైకోర్టు సిట్టింగ్ జడ్జిపై అసభ్యకరమైన ఆరోపణలు చేసిన ఈ క్లైంట్ కు కోర్టు ధిక్కార నోటీసులు పంపిస్తం’ అని ఫైర్అయ్యారు. దీంతో ఈ పిటిషన్ ను ఉపసంహరించుకునేందుకు అవకాశం ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఇందుకు ససేమీరా అన్న సీజేఐ.. ఇదే రీతిలో న్యాయమూర్తులకు సంబంధించి నమోదైన కోర్టు ధిక్కార కేసు ఎంవై షరీఫ్ వర్సెస్ నాగ్ పూర్ కేసులో దాఖలైన పిటిషన్ పై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు మీకు తెలియవా? అని ప్రశ్నించారు.
జడ్జిలను బోనులో నిలబెడతామంటే ఊరుకోం
అనంతరం పిటిషన్పై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మిస్ యూజ్ నుంచి న్యాయవాదనులను రక్షించే ప్రయత్నం మేం చేస్తం. కానీ ఇందుకు భిన్నంగా జడ్జిలను బోన్ లో నెలబెడతామనే ఇలాంటి ఆరోపణలను అనుమతించబోం. ఇది పూర్తిగా నిర్లక్ష్యం, తప్పుబట్టాల్సిన ఆరోపణలు’ అని అన్నది. ‘ఒక సిట్టింగ్ జడ్జిపై అసభ్యకరమైన ఆరోపణలు చేశారు. కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు. న్యాయవాది ఇలాంటి పిటిషన్ వేసే ముందు, కనీసం సంతకం చేసే ముందు చూసుకోరా?
అందువల్ల పిటిషనర్ పెద్ది రాజుతో పాటు, ఏవోఆర్ రితేశ్ పాటిల్, న్యాయవాదులకు నోటీసులు జారీ చేస్తున్నం’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనిపై కోర్టు సాక్షిగా పిటిషనర్ తరఫు న్యాయవాది నితిన్ మిశ్రా క్షమాపణలు కోరారు. అయితే... ఈ క్షమాపణలను పరిగణలోకి తీసుకోబోమన్న ధర్మాసనం.. రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని తేల్చి చెప్పారు.