- ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు ఏవీ?
- ఆగస్టు 16లోపు అఫిడవిట్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం
- విచారణ ఆగస్టు 23కు వాయిదా
న్యూఢిల్లీ, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మూడో(అదనపు) టీఎంసీ పనుల్లో స్టేటస్ కో పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పనులు నిలిపివేయాలని స్పష్టం చేసింది. భూసేకరణ గురించి పక్కనపెడితే.. ప్రాజెక్టుకు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లు లేవన్న విషయాన్ని కోర్టు ప్రస్తావించింది. భూసేకరణ లావాదేవీలను సమగ్రంగా నమోదు చేస్తామని, భూసేకరణ చట్టబద్ధతను హైకోర్టు తేల్చాలని పేర్కొంది. దీనిపై ఆగస్టు 16 లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూడో టీఎంసీ(అదనపు) పనులను ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్, డీపీఆర్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోందని పలువురు భూనిర్వాసితులు, చెరుకు శ్రీనివాస్ రెడ్డి గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ ప్రాజెక్టు కోసం జరుగుతోన్న భూసేకరణను అడ్డుకోవాలని కోరారు. వీరి పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. బుధవారం ఈ పిటిషన్ను జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ అభయ్, జస్టిస్ జేబీ పార్థీవాలాతో కూడిన త్రీమెంబర్ బెంచ్ విచారించింది.
అనుమతుల్లేకుండా పనులు..
ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా మూడో టీఎంసీ పనులు జరుగుతున్నాయని, ఇందుకోసం భూసేకరణ చేపడుతున్నారని నిర్వాసితుల తరపున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. రూ. 16 వేల కోట్ల ఖర్చుతో అదనపు టీఎంసీ పనులు చేపట్టారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రాజెక్టుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్జీటీ) కూడా స్టే ఇచ్చిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వకేట్ వైద్య నాథన్ వాదనలు వినిపించారు. కేవలం 120 రోజుల్లో నీటిని లిఫ్ట్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టిందన్నారు. అయితే, అకాల వర్షాలు పడే సందర్భాల్లో తక్కువ సమయంలో ఎక్కువ నీటిని ఎత్తిపోసేలా మూడో టీఎంసీ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో రైతుల ప్రయోజనాలు కూడా ఉన్నాయన్నారు. ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోయడం పక్క రాష్ట్రానికి ఇష్టం లేదన్నారు. మూడో టీఎంసీకి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ పై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని ఎన్జీటీ తీర్పు ఇచ్చిందని, అందుకే స్టేటస్కో విధించవద్దని కోరారు. దీంతో ప్రాజెక్టు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లు చూపించాలని బెంచ్ కోరింది. మూడో టీఎంసీ పనులపై స్టేటస్ కో విధిస్తూ, తదుపరి విచారణను వచ్చే నెల 23 కు వాయిదా వేసింది.
