న్యూఢిల్లీ: ఆధార్, ఓటర్ ఐడీ కార్డును లింక్ చేసే వివాదాస్పద చట్టాన్ని రద్దు చేయాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సుర్జేవాలా సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం విచారణ జరగనుంది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, వ్యక్తుల గోప్యతతో పాటు సమానత్వ హక్కును ఉల్లంఘించడమే అవుతుందని పిటిషన్లో ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్లో ఎలాంటి డిబేట్ పెట్టకుండా బిల్లును పాస్ చేసిందని తెలిపారు. ఎన్నికల సంస్కరణ ప్రక్రియలో భాగంగా.. ఎలక్షన్ కమిషన్ ఆధార్, ఓటర్ ఐడీ ప్రాజెక్టును ప్రారంభించిందని వివరించారు. ఆధార్, ఓటర్ కార్డు లింక్ చేస్తే ఇండియన్ సిటిజన్స్ కానివారు కూడా ఓటు వేస్తారని తెలిపారు. కాంగ్రెస్ డీఎంకే, ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్, శివసేనతో పాటు బీఎస్పీలు ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని వివరించారు. ఈ బిల్లుపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనల్లో భాగంగా.. టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబెరాయ్ రాజ్యసభ చైర్పైకి రూల్ బుక్ విసిరారని ఆరోపిస్తూ.. ఆయనను సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. ఆధార్ అనేది.. రెసిడెంట్ ప్రూఫ్అని, సిటిజన్షిప్ కాదని కాంగ్రెస్ఎంపీ శశిథరూర్ స్పష్టం చేశారు.
లింక్ తప్పనిసరి కాదన్న కేంద్ర మంత్రి
సుప్రీం కోర్టు గోప్యతా హక్కు తీర్పు ప్రకారం.. ఓటరు గుర్తింపు కార్డుతో ఆధార్ లింక్ స్వచ్ఛందంగా ఉంటుందని న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు నొక్కి చెప్పారు. ఇది తప్పనిసరి కాదన్నారు. ఆధార్ కార్డు లేకపోయినా.. ఓటర్ జాబితా నుంచి అతని పేరు తొలగించబడదని తెలిపారు.