ఉచిత హామీల అంశాన్ని పార్లమెంట్లో చర్చిస్తారని మీరు భావిస్తున్నారా? అయితే.. ఏ పార్టీ చర్చిస్తుంది? ఏ రాజకీయ పార్టీ కూడా ఉచితాలకు వ్యతిరేకం కాదు. కానీ, ట్యాక్స్ పేయర్స్, దేశ ఆర్థిక వ్యవస్థ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది.
‑ ఈ అంశాన్ని పార్లమెంట్కు వదిలేయాలన్న అడ్వకేట్ కపిల్ సిబల్ కామెంట్స్పై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
న్యూఢిల్లీ: ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత పథకాల హామీలు, ప్రకటనల కట్టడిపై అధ్యయనం కోసం ఎక్స్పర్ట్స్ కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ కమిటీలో నీతి ఆయోగ్, ఫైనాన్స్ కమిషన్, అధికార, ప్రతిపక్ష పార్టీలు, ఆర్బీఐకి చోటు కల్పించాలని పేర్కొంది. ఉచితాలను ఎలా కంట్రోల్ చేయొచ్చో కమిటీ సూచనలు చేస్తుందని తెలిపింది. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆధ్వర్యంలోని సుప్రీం బెంచ్ ఈ మేరకు బుధవారం తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఉచిత హామీల వల్ల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని, వీటిని అదుపు చేయడంపై కమిటీ స్టడీ చేసి కేంద్రానికి, ఎలక్షన్ కమిషన్కు, సుప్రీంకోర్టుకు నివేదిక ఇస్తుందని తెలిపింది. కమిటీ ఏర్పాటుపై ఏడు రోజుల్లో తమ సూచనలు, అభిప్రాయాలు తెలియజేయాలని కేంద్రాన్ని, ఈసీని, సీనియర్ అడ్వకేట్, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ను, పిటిషనర్లను సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఇష్టారీతి ఉచిత హామీలతో దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పేనని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. దీనిని పార్లమెంట్కు వదిలేయాలని, అక్కడ చర్చించి చట్టాన్ని తేవొచ్చని సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ అన్నారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ.. ‘‘ఉచిత హామీల అంశాన్ని పార్లమెంట్లో చర్చిస్తారని మీరు భావిస్తున్నారా? అయితే.. ఏ పార్టీ చర్చిస్తుంది? ఏ రాజకీయ పార్టీ కూడా ఉచితాలకు వ్యతిరేకం కాదు. ట్యాక్స్పేయర్స్, దేశ ఆర్థిక వ్యవస్థ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది” అని స్పష్టం చేశారు.