- ఆర్మీ లౌకిక వ్యవస్థ..దాని డిసిప్లిన్లో ఎటువంటి రాజీ ఉండదు: సుప్రీంకోర్టు
- అధికారి ఆదేశాలు ధిక్కరించే వ్యక్తి ఆర్మీకి ‘‘మిస్ఫిట్’’ అని వ్యాఖ్య
- ఎంత ప్రతిభావంతుడైనా కొనసాగేందుకు అనర్హుడేనని తీర్పు
న్యూఢిల్లీ: గురుద్వారాలోకి ప్రవేశించేందుకు నిరాకరించిన క్రైస్తవ మతానికి చెందిన ఆర్మీ అధికారి తొలగింపును సుప్రీంకోర్టు సమర్థించింది. సైన్యం సెక్యులర్ వ్యవస్థ అని దాని డిసిప్లిన్ విషయంలో ఎటువంటి రాజీపడబోమని తేల్చి చెప్పింది. తన తోటి (సిక్కు) సైనికుల విశ్వాసాన్ని గౌరవించడంలో విఫలమైనందుకు అతన్ని డిస్మిస్ చేయాలనే నిర్ణయం సరైందేనని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొన్నది.
3వ అశ్వికదళ రెజిమెంట్లో లెఫ్టినెంట్గా పనిచేస్తున్న శామ్యూల్ కమలేశన్ అనే అధికారి తన తోటి సైనికులతో కలిసి పూజ నిర్వహించడానికి గురుద్వారాలోకి వెళ్లేందుకు నిరాకరించారు. ఉన్నతాధికారులు ఆదేశించినప్పటికీ.. ఒకే దేవుడిని పూజించాలనే తన క్రైస్తవ మత విశ్వాసానికి అది వ్యతిరేకమంటూ తిరస్కరించారు.
ఇది సైనిక క్రమశిక్షణను ధిక్కరించడమేనని మిలటరీ అతన్ని తొలగించింది. దీనిపై అతను ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. మే నెలలో ఢిల్లీ హైకోర్టు తీర్పునిస్తూ ఆర్మీ ఉన్నతాధికారుల నిర్ణయాన్ని సమర్థించింది. “చట్టబద్ధమైన మిలిటరీ ఉన్నతాధికారి ఆదేశం కన్నా మత విషయాన్ని ఉన్నతమైందని పేర్కొనడం. నియమాలకు విరుద్ధం”అంటూ తీర్పులో పేర్కొంది.
దీన్ని శామ్యూల్ సుప్రీంకోర్టులో సవాల్చేశారు. సుప్రీంకోర్టు సీజే సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్దీనిపై మంగళవారం తుదితీర్పు వెలువరించింది. ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించని ఆయన మిలటరీకి ‘‘మిస్ ఫిట్’’ అని వ్యాఖ్యానించింది. సైన్యంలో విధేయత, డిసిప్లిన్ వంటి ప్రాథమిక విలువల్ని పట్టించుకోని అధికారులను సహించలేమని సీజేఐ సూర్యకాంత్ అన్నారు.
‘‘అతను ఎంత ప్రతిభావంతుడైనా, ఆర్మీకి మిస్ఫిట్. ఇటువంటి మొండి వ్యక్తులు మిలటరీలో కొనసాగడానికి అనర్హులు” అని అన్నారు. మరో న్యాయమూర్తి జస్టిస్ జోయ్మాలా బాగ్చి మాట్లాడుతూ, “మీ పాస్టర్ సలహా ఇచ్చినా కూడా వినలేదు.. యూనిఫాంలో ఉన్నప్పుడు వ్యక్తిగత అభిప్రాయాలు, అవగాహనలు నడవవు’’ అని స్పష్టం చేశారు.
