న్యూఢిల్లీ: పెటర్నిటీ లీవ్ (పితృత్వ సెలవు)ను సామాజిక భద్రతా హక్కుగా గుర్తిస్తూ చట్టం తీసుకురావాలని సుప్రీంకోర్టు మంగళవారం కేంద్రానికి సూచించింది. అదే సమయంలో, దత్తత తీసుకున్న చిన్నారి వయసుతో సంబంధంలేకుండా దత్తత తల్లికి 12 వారాల మాతృత్వ సెలవు హక్కు ఉంటుందని స్పష్టంచేసింది. పిల్లల పెంపకం తల్లిదండ్రుల సమష్టి బాధ్యత అని సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్.మహాదేవన్ బెంచ్ స్పష్టం చేసింది. పిల్లల జీవితంలో తొలి నెలలు చాలా కీలకమైనవని, ఆ సమయంలో తండ్రి సాన్నిహిత్యం పిల్లల మానసిక ఎదుగుదలకు ఎంతో అవసరమని కోర్టు అభిప్రాయపడింది.
