తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ఎన్నికయ్యారు. టీఎఫ్సీసీ 2025–27 కాలానికి సంబంధించి కార్యవర్గ ఎన్నికలు ఆదివారం జరిగాయి. మొత్తం 3,355 మంది సభ్యులున్న ఫిలిం ఛాంబర్లో 1417 మంది నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు, స్టూడియో రంగాల సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మన ప్యానెల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య జరిగిన ఈ పోటీలో ప్రోగ్రెసివ్ ప్యానెల్ విజయాన్ని అందుకుంది.
48 మంది కార్యవర్గానికి ప్రోగ్రెసివ్ ప్యానెల్లో 31, మన ప్యానెల్లో 17 మంది గెలుపొందారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ మద్దతుతో సురేష్ బాబు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్గా సూర్యదేవర నాగవంశీ, ఫిలిం ఛాంబర్ సెక్రటరీగా అశోక్ కుమార్, ట్రెజరర్గా ముత్యాల రామదాసు ఎంపికయ్యారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రోగ్రెసివ్ ప్యానెల్ కృషి చేస్తుందని నిర్మాతలు సురేష్ బాబు, నాగవంశీ, దామోదర ప్రసాద్, వై రవి శంకర్, రవి కిషోర్ అన్నారు.
