
టీ 20 ప్రపంచకప్ లో అద్భుతంగా రాణిస్తున్న టీమిండియా యంగ్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 ర్యాంక్ దక్కించుకున్నాడు. నెదర్లాండ్స్ (51), సౌతాఫ్రికా (68)లపై వరుస హాఫ్ సెంచరీలు చేసిన సూర్యకుమార్ యాదవ్ 863 రేటింగ్ పాయింట్లను తన ఖాతాలో వేసుకుని ఫస్ట్ ప్లేస్ లో నిలిచాడు. ఇంతకుముందు టాప్లో ఉన్న పాక్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్.. ఈ వరల్డ్కప్లో అంతగా రాణించకపోవడంతో అగ్రస్థానాన్ని కోల్పోయాడు. ప్రస్తుతం రిజ్వాన్ ఖాతాలో 842 పాయింట్లు ఉన్నాయి.
ఇక ఈ లిస్టులో మూడో ప్లేస్లో న్యూజిలాండ్ క్రికెటర్ డెవాన్ కాన్వే, నాలుగో ప్లేస్లో బాబర్ ఆజమ్ ఉన్నారు. విరాట్ కోహ్లీ పదో ప్లేస్లో ఉండగా, రోహిత్ శర్మ మరో స్థానం దిగజారి 15వ స్థానంలో కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ తర్వాత టీ 20 క్రికెట్లో నెంబర్ 1 స్థానానికి చేరుకున్న రెండో ఇండియన్ క్రికెటర్ సూర్యకుమార్ కావడం విశేషం. 2021 లో క్రికెట్ లోకి అరంగ్రేటం చేసిన సూర్యకుమార్ యాదవ్ అతితక్కువ కాలంలోనే నెంబర్ వన్ ర్యాంకును దక్కించుకున్నాడు.