
- రూ.100 కోట్లతో వ్యాపారం
- రూ.5 లక్షలు దాటని మార్కెట్ ఫీజు
- వ్యాపారులతోఅధికారులు కుమ్మక్కు
- ఏటా సాగుతున్న అక్రమ బాగోతం
సూర్యాపేట, వెలుగు : ఒకవైపు వ్యవసాయ మార్కెట్ కుఆదాయం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుండగా, మరోవైపు ఆ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఆదాయానికి గండి పడుతోంది. సూర్యాపేట మామిడి మార్కెట్ యార్డులో కోట్లల్లో వ్యాపారాలు కొనసాగుతున్నా మార్కెటింగ్ శాఖకు మాత్రం రూ.5 లక్షలకు మించి ఆదాయం రాకపోవడంతో అనుమానాలు కలుగుతున్నాయి. మామిడి వ్యాపారులు.. అధికారులతో కుమ్మక్కై వ్యవసాయ మార్కెట్ శాఖకు ఆదాయానికి రాకుండా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యాపారులు నిర్వహించిన కొనుగోళ్లలో మార్కెట్ కమిటీకి ఒక్క శాతం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రూ.కోట్లలో వ్యాపారం జరుగుతున్నప్పటికీ మార్కెట్ కు ఫీజు మాత్రం అంతంత మాత్రంగానే చెల్లిస్తున్నారు. దీంతో మార్కెట్కు తగిన ఆదాయం రావడం లేదు. కొన్నేండ్లుగా సూర్యాపేట మామిడి మార్కెట్కు ఏటా రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షలలోపు మాత్రమే ఆదాయం వస్తోంది.
రూ.100 కోట్ల వ్యాపారం..
సూర్యాపేట –జనగామ రోడ్ వద్ద అధికారికంగా 17, అనధికారికంగా 3 మామిడి మార్కెట్లు నిర్వహిస్తున్నారు. ఈ మార్కెట్లలో ప్రతి సీజన్లో దాదాపు రూ.100 కోట్ల నుంచి రూ.200 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతోంది. ఏటా సుమారు 5 వేల మంది కార్మికులు ఇతర రాష్ట్రాల నుంచి వస్తుంటారు. ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, చండీగఢ్, హర్యానా, పంజాబ్, నాగ్పూర్ వంటి రాష్ట్రాలకు లారీల్లో మామిడి కాయలు తరలిస్తుంటారు. ప్రతిరోజు 20 నుంచి 30 లారీల్లో మామిడికాయలు వివిధ ప్రాంతాలకు తీసుకెళ్తారు. పెద్ద లారీల్లో సుమారు 12 నుంచి 15 టన్నుల మామిడి కాయలు తరలిస్తుంటారు. గత నాలుగైదేండ్లుగా సగటున టన్నుకు రూ.30 వేల వరకు ధర పలికింది.
టన్నుకు రూ.30 వేల చొప్పున 15 టన్నులకు రూ.4.50 లక్షలు అవుతోంది. వ్యాపారులు మార్కెట్కు ఒక్క శాతం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో లారీకి రూ.4,500 ఫీజు చెల్లించాలి. ప్రతిరోజు 30 లారీల్లో మామిడికాయలు తరలితే సుమారు రూ.1.62 లక్షలు ఫీజు మార్కెట్కు ఆదాయం రావాల్సి ఉంది. దాదాపు నాలుగు నెలలపాటు మామిడి మార్కెట్ కొనసాగుతుంది. ఈ లెక్కన రూ.కోటిన్నరకు పైగా మార్కెట్కు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మామిడి కాయ ధర పెరిగిన సందర్భంలో దాని ప్రకారం ఫీజు కట్టాల్సి ఉంటుంది. వ్యాపారులు అధిక రేటుకు మామిడి కాయలు కొనుగోలు చేసి తక్కువ రేటుకు కొన్నట్లు చెబుతూ ఆ మేరకు మార్కెట్ ఫీజుకు గండి కొడుతున్నారు.
వ్యాపారం రూ.కోట్లకు పైగా..
సూర్యాపేట మామిడి మార్కెట్కు 2022లో రూ.22.51 లక్షల ఫీజు వసూళ్లు అయింది. 2022 –-23లో రూ.19.84 లక్షలు, 2023–24లో రూ.3.39 లక్షలు, 2024 –-25లో రూ.4.36 లక్షలు మాత్రమే మార్కెట్ ఫీజు వసూళ్లు అయినట్లు అధికారులు చెబుతున్నారు. మార్కెట్ లైసెన్స్ తీసుకోవడానికి, నిర్ణీత ఫీజు చెల్లించడానికి వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఏటా జిల్లాలో వ్యాపారుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ లైసెన్స్ తీసుకునేందుకు మాత్రం ముందుకు రావడం లేదు.
సూర్యాపేట మార్కెట్ లో 17 షాపులకే లైసెన్స్ ఉన్నాయని లెక్కలు చెబుతున్నారు. లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న వ్యాపారులను అధికారులు పట్టించుకోవడం లేదు. రూల్స్ ప్రకారం లైసెన్స్ తీసుకొని ఫీజులు చెల్లిస్తే మార్కెట్కు తగిన ఆదాయం సమకూరే అవకాశం ఉంది. వ్యాపారులు చేపట్టే లావాదేవీల ఆధారంగా మార్కెట్యార్డుకు సెస్ చెల్లిస్తారు. మార్కెట్ ఫీజు ఎగవేయడానికే వ్యాపారులు ఎత్తులు వేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.