మాదాపూర్ హోటల్ రూమ్​లో హెటిరో .. ఉద్యోగిని అనుమానాస్పద మృతి

మాదాపూర్ హోటల్ రూమ్​లో హెటిరో .. ఉద్యోగిని అనుమానాస్పద మృతి

మాదాపూర్, వెలుగు: హోటల్ ​రూమ్​లో హెటిరో ఫార్మా ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ఘటన మాదాపూర్ పీఎస్ పరిధిలో జరిగింది. ఎస్సై వెంకట్ తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైలోని అంబటూర్ ప్రాంతానికి చెందిన శ్రీహరి (25) తన తండ్రి రమేశ్​కు చెందిన రాఘవ ఎంటర్​ప్రైజెస్​బిజినెస్ పనులను చూసుకుంటున్నాడు. పాండిచ్చేరిలోని తట్టంవాడి కామరాజ్ నగర్ ప్రాంతానికి చెందిన ఎస్. శ్రావణ ప్రియ(25) జడ్చర్లలోని హెటిరో కంపెనీలో జాబ్ చేస్తోంది. 

శ్రీహరి, శ్రావణ ప్రియ ఇద్దరు చెన్నైలో ఇంటర్​ చదివే సమయంలో ఫ్రెండ్స్. రెండ్రోజుల కిందట శ్రీహరి ఫ్రెండ్స్​ను కలిసేందుకు హైదరాబాద్ వచ్చాడు. మంగళవారం ఫ్రెండ్స్​తో కలిసి గోల్కోండ కోటకు వెళ్లాడు. ఆ తర్వాత ఇక్కడే ఉంటున్న శ్రావణ ప్రియను కలిసేందుకు ఆమె కాల్ చేశాడు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ రోడ్ నం.36లోని గోల్డెన్ హైవ్ ఓయో హోటల్​లో మంగళవారం సాయంత్రం 6 గంటలకు రూమ్ బుక్ చేశాడు.

 డ్యూటీ ముగిసిన తర్వాత శ్రావణ ప్రియ జడ్చర్ల నుంచి రాత్రి 9 గంటలకు హోటల్ రూమ్​కు వచ్చింది. శ్రీహరి, శ్రావణ ప్రియ ఇద్దరూ కలిసి రూమ్​లో మద్యం తాగారు. అర్ధరాత్రి శ్రీహరికి వాంతులు కావడంతో దగ్గరలోని ప్రైవేటు హాస్పిటల్​కు వెళ్లాడు. బుధవారం ఉదయం శ్రావణ ప్రియ హోటల్ రూమ్​ నుంచే జోమాటోలో ఫుడ్ ఆర్డర్​ చేసుకుంది. 10 గంటలకు ఫుడ్ ఇచ్చేందుకు డెలివరీ బాయ్​ హోటల్ రూమ్​ దగ్గరకు వెళ్లగా శ్రావణ ప్రియ స్పందించలేదు. దీంతో డెలివరీ బాయ్​ ఫుడ్​ను​ హోటల్​ రిసెప్షన్​లో ఇచ్చేసి వెళ్లాడు. ముందురోజు అర్ధరాత్రి హాస్పిటల్​కు వెళ్లిన శ్రీహరి బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు హోటల్​కు చేరుకున్నాడు. 

మూడో ఫ్లోర్​లోని రూమ్​కు వెళ్లి చూడగా.. శ్రావణ ప్రియ ఎలాంటి కదలిక లేకుండా నేలపై పడి ఉంది. హోటల్​ సిబ్బందితో కలిసి శ్రీహరి ఆమెను వెంటనే అంబులెన్స్​లో ఆసుపత్రికి తరలించేందుకు కిందకు తీసుకువచ్చారు. అంబులెన్స్ సిబ్బంది శ్రావణ ప్రియను పరిశీలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు తెలిపారు.  హోటల్ సిబ్బంది మాదాపూర్​పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్​ టీంతో వివరాలను సేకరించారు. రూమ్ లో మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.  శ్రీహరిని అదుపులోకి తీసుకొన్నారు. డెడ్​బాడీని ఉస్మానియాకు తరలించారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.