కొంపల్లి శ్రీచైతన్య హాస్టల్​లో స్టూడెంట్ అనుమానాస్పద మృతి

కొంపల్లి శ్రీచైతన్య హాస్టల్​లో స్టూడెంట్ అనుమానాస్పద మృతి

జీడిమెట్ల, వెలుగు: కొంపల్లిలోని శ్రీచైతన్య స్కూల్​హాస్టల్​లో ఓ బాలుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. పోలీసులు, బాలుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్​జిల్లా అల్లాదుర్గ్ మండలం చిల్వర్ గ్రామానికి చెందిన బీరయ్య, మాధవి దంపతుల కుమారుడు మల్లికార్జున్(12)ను ఏడాదిగా కొంపల్లిలోని శ్రీచైతన్య స్కూల్ లో చదివిస్తున్నారు. వేసవి సెలవులు అనంతరం తల్లిదండ్రులు సోమవారం బాలుడిని హాస్టల్ లో చేర్పించారు. మల్లికార్జున్​ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్నాడు. అయితే తోటి పిల్లలతో కలిసి సోమవారం రాత్రి భోజనం చేసి పడుకున్న బాలుడు మంగళవారం ఉదయం లేవలేదు. 

అతని రూమ్​మేట్స్​ఎన్నిసార్లు పిలిచినా పలకకపోవడంతో హాస్టల్​వార్డెన్​కు సమాచారం ఇచ్చారు. వార్డెన్​వచ్చి బాలుడిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే మల్లికార్జున్​చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన హాస్పిటల్​కు చేరుకున్నారు. తమ బిడ్డ మృతిపై అనుమానం ఉందని, విచారణ జరిపి స్కూల్​యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని మాధవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మల్లికార్జున్​మృతి విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు స్టూడెంట్లతో కలిసి మంగళవారం ఉదయం కొంపల్లిలోని శ్రీచైతన్య స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. 

శ్రీచైతన్య యాజమాన్యం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారికి సర్దిచెప్పి పంపించారు. కొంపల్లి శ్రీచైతన్య స్కూల్​యాజమాన్యం నిర్లక్ష్యంతో పిల్లలు ఇబ్బంది పడుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గతేడాది మార్చిలో ఇదే క్యాంపస్​లో నైన్త్, టెన్త్​క్లాస్​స్టూడెంట్లు రాడ్లతో కొట్టుకున్నారు. తాజాగా ఏడో తరగతి స్టూడెంట్​చనిపోవడం తల్లిదండ్రులను ఆందోళన కలిగిస్తోంది. యాజమాన్యం తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు.