హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగాలేక జీతాలు ఆలస్యమవుతున్నాయని, ఉద్యోగులు సర్దుకుపోవాలని శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ అన్నారు. గతంలోనూ జీతాలు ఆలస్యమయ్యాయని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఎవరికీ అమ్ముడుపోలేదని, రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యోగ సంఘాల నేతలు అన్ని పార్టీలతో కలిసి పోరాటం చేశాయన్నారు. కిషన్ రెడ్డి పోరుయాత్రకు కూడా టీఎన్జీవోలు మద్దతు ఇచ్చాయని గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం కాంగ్రెస్తోనూ కలిసి ఉద్యమాలు చేశామన్నారు. బీజేపీ నేతల అనుచిత వ్యాఖ్యలతో ఆ పార్టీకి ఉద్యోగులు దూరమవుతారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తమను చంపడానికి కూడా ప్రయత్నాలు జరిగాయని స్వామి గౌడ్ అన్నారు. ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరిస్తున్న టీఆర్ఎస్కు ఓటెయ్యాలని టీఎన్జీవోలు పిలుపునిస్తే తప్పేంటని టీఆర్ఎస్ నాయకుడు దేవిప్రసాద్ ప్రశ్నించారు.