ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ స్పై మాస్టర్ జనరల్ అసీమ్ మునీర్ ఆ దేశ 17వ ఆర్మీ చీఫ్ గా మంగళవారం బాధ్యతలు చేపట్టారు. జనరల్ ఖమర్ జావేద్ భజ్వా రిటైర్ కావడంతో ఆ స్థానాన్ని జనరల్ మునీర్ భర్తీ చేశారు. జనరల్ హెడ్క్వార్టర్స్ (జీహెచ్క్యూ)లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ఆర్మీ సీనియర్ అధికారులు, డిప్లొమాట్స్ తో పాటు రాజకీయ పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జనరల్ భజ్వా మాట్లాడారు. దేశ రక్షణ బాధ్యతలు సేఫ్ గా ఆర్మీ కమాండ్ చేతుల్లో పెడుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.
తర్వాత భజ్వా.. జనరల్ మునీర్ కు బ్యాటన్ను అందజేశారు. నవంబర్ 24న ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆర్మీ చీఫ్ పోస్టుకు మునీర్ పేరును నామినేట్ చేశారు. ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ), మిలటరీ ఇంటెలిజెన్స్ (ఎంఐ)కు జనరల్ ఆసిమ్ మునీర్ చీఫ్ గా వ్యవహరించారు. ఎంతో అనుభవం ఉన్న ఆఫీసర్ గా పేరుంది. 2018 అక్టోబర్లో ఐఎస్ఐ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత అప్పటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ 8 నెలల్లోనే ఆయనను ఐఎస్ఐ చీఫ్ పదవి నుంచి తప్పించారు. తనకు అత్యంత సన్నిహితుడైన లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్ను కొత్త చీఫ్గా నియమించారు. దీనికి ముందు ఆసిమ్ మునీర్ ఫ్రాంటియర్ ఫోర్స్ రెజిమెంట్లో పనిచేశారు. మాజీ ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ భజ్వాకు అత్యంత సన్నిహితుడు.