
కుప్పం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూసేకరణపై రైతులు ఎదురు తిరుగుతున్నారు. బలవంతపు భూసేకరణకు ప్రయత్నిస్తే ఆత్మహత్యలు చేసుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమ పంట పొలాలలోకి పురుగు మందు డబ్బాలతో వచ్చి రైతులు నిరసన తెలిపారు.
కుప్పంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేపట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రామకుప్పం, శాంతిపురం మండలాల్లో భూసేకరణ చేస్తోంది. శాంతిపురం మండలం దండికుప్పంలో భూసేకరణకు కూటమి ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది.
భూమిని పరిశీలించేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులను రైతులు అడ్దుకున్నారు. ప్రభుత్వానికి తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. రెవెన్యూ అధికారులు బెదిరింపులకు దిగుతున్నారని రైతులు చెబుతున్నారు.
కుప్పంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు కోసం రాష్ర్ట ప్రభుత్వం 1405 ఎకరాలు భూ సేకరణ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో రైతుల నుంచి ఇప్పటికే 458 ఎకరాలు భూమి సేకరించింది. అదనపు భూమి కోసం రైతుల నుండి సేకరించేందుకు అధికారులు పర్యటించారు. ఈ సందర్భంగా భూములు ఇవ్వకుంటే బలవంతంగా లాక్కోవాల్సి వస్తుందని అధికారులు బెదిరించారని రైతులు వాపోయారు.
మర్యాదగా భూములు ఇస్తే ఎకరాకు రూ.16 లక్షలు ఇస్తామని, ఇవ్వమని అడ్డం చెబితే రూ.10 లక్షలు ఇస్తామని, కోర్టుకు పోతే ఒక్క రూపాయి కూడా రాదని అధికారులు బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ భూములు విమానాశ్రయానికి ఇవ్వడానికి సిద్ధంగా లేమని రైతులు తెలిపారు.