
పద్మారావునగర్, వెలుగు: ఎన్నికల సమయంలో వచ్చి, తర్వాత మొఖం చాటేసే వారి మాటలను నమ్మొద్దని సనత్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. శనివారం బేగంపేటలోని ఓల్డ్ పాటిగడ్డ, నూర్ బాగ్లల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడు ఎన్నికలు రావడం వల్ల మీ వద్దకు వస్తున్నారని ఇన్ని రోజులు ఎక్కడికిపోయారని ప్రశ్నించారు. తాను నిరంతరం 24 గంటలు మీ మధ్యనే ఉంటూ మీ కష్ట సుఖాలను పంచుకున్నాననే విషయాన్ని గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత డ్రైనేజీ, రోడ్ల సమస్యలను పరిష్కరించామని చెప్పారు. పాటిగడ్డలో రూ 6. కోట్లతో మల్టి ఫర్పస్ ఫంక్షన్ హాల్ ను నిర్మించామన్నారు. మంత్రి వెంట కార్పొరేటర్ టి.మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ ఉప్పల తరుణి, డివిజన్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓల్డ్ పాటిగడ్డ లో బీజేపీ కి చెందిన సాయి, నాని, నితీష్, మహేష్ లు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
బేగంపేట లోని ఎయిర్ లైన్స్ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. కాలనీలో అనేక సమస్యలను పరిష్కరించామని, ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని ఎన్నికల అనంతరం పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాలనీ అధ్యక్షుడు నగేష్, జనరల్ సెక్రెటరీ గోపాల్, ఉపాధ్యక్షుడు అరవింద్, రాజేందర్, కృష్ణ పాల్గొన్నారు.
వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసం వద్ద అమీర్ పేట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి ఆధ్వర్యంలో 15 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీ నామా చేసి మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.