కాంగ్రెస్ పార్టీవి మోసపూరిత హామీలు: తలసాని

కాంగ్రెస్ పార్టీవి మోసపూరిత హామీలు: తలసాని

పద్మారావునగర్, వెలుగు: ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ నాయకులు జనాలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సనత్ నగర్ సెగ్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం సనత్​నగర్​లోని సుభాష్ నగర్, సాయిబాబానగర్, జై ప్రకాశ్​ నగర్, కైలాష్​నగర్​లో ఆయన ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలు ఆయనకు మంగళహారతులు పట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. కర్నాటకలో అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. 

 అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయలేక చేతులేత్తేసిందన్నారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ నాయకులు మోసపూరిత హామీలను ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులకే గ్యారంటీ లేదని.. ఇక వారు చెప్పే ఆరు గ్యారంటీలను ఎవరు నమ్ముతారని తలసాని శ్రీనివాస్ సెటైర్ వేశారు. ఆయన వెంట కార్పొరేటర్ కొలను లక్ష్మి, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కొలను బాల్ రెడ్డి, జనరల్ సెక్రటరీ శేఖర్, ఉన్నారు. రాంగోపాల్ పేట డివిజన్ నల్లగుట్ట మసీదు ప్రాంతంలో తలసాని శ్రీనివాస్ ప్రచారం నిర్వహించారు. 

ముస్లిం మత పెద్దలు ఆయనను సన్మానించి.. మైనార్టీల నుంచి సంపూర్ణ మద్దతు తెలిపారు. తలసాని వెంట మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ ఉన్నారు. వెస్ట్ మారేడ్​పల్లిలో తలసాని శ్రీనివాస్ ఇంటి వద్ద అసోసియేషన్ ప్రతినిధులు ఆయనను కలిసి మద్దతు ప్రకటించారు. తొందరలో పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేయబోతున్నామని హాజరు కావాలని ఆహ్వానించారు. సాయంత్రం రాంగోపాల్ పేట డివిజన్ కుర్మ బస్తీ, ఓల్డ్ బోయిగూడలో తలసాని శ్రీనివాస్ ప్రచారం నిర్వహించారు.