జల్లికట్టుకు అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు

జల్లికట్టుకు అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు

జల్లికట్టుకు అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. జల్లికట్టు పోటీలపై  ఎలాంటి నిషేదం లేదని చెప్పింది.  తమిళనాడు ప్రభుత్వం చేసిన చట్టానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. గతంలో ఇచ్చిన తీర్పును జస్టిస్ KM జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం కొట్టేసింది. 

జల్లికట్టు క్రీడను, మహారాష్ట్రలో ఎద్దుల బండ్ల పోటీలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టేసింది. జల్లికట్టు తమిళనాడు సంస్కృతిక వారసత్వంలో భాగమని అసెంబ్లీ ప్రకటించినప్పుడు, న్యాయవ్యవస్థ అందుకు భిన్నమైన అభిప్రాయాన్ని తెలపదని వ్యాఖ్యానించింది. జంతు హింస చట్టం జల్లికట్టుకు వర్తించదని తెలిపింది.  జల్లికట్టు తమిళనాడు  ప్రతీక అని..  పోటీల్లో భద్రతా ప్రమాణాలు పాటిస్తామని కోర్టుకు లిఖిత పూర్వక హామీ ఇచ్చింది తమిళనాడు ప్రభుత్వం. 

 ప్రతి ఏడాది సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో జల్లికట్టు క్రీడను నిర్వహిస్తారనే సంగతి తెలిసిందే.  దీనిని ఎద్దులను మచ్చిక చేసుకునే క్రీడగా చెబుతారు. జల్లికట్టును అనుమతిస్తూ 2017 లో చట్టం చేసింది తమిళనాడుప్రభుత్వం. సుప్రీం తీర్పుతో తమిళనాడులో సంబరాలు చేసుకుంటున్నారు ప్రజలు. టపాసులు పేలుస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.