- ఒకుహరాకు తన్వీ షాక్
లక్నో: ఇండియా యంగ్ షట్లర్ తన్వీ శర్మ సంచలనం సృష్టించింది. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో 16 ఏండ్ల తన్వీ.. మాజీ వరల్డ్ నంబర్ వన్, ఒలింపిక్ మెడలిస్ట్ నజోమి ఒకుహరాకు షాకిచ్చి ఔరా అనిపించింది. గురువారం జరిగిన విమెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో 13–-21, 21–-16, 21-–19 జపాన్ స్టార్ ఒకుహరాను ఓడించి క్వార్టర్ ఫైనల్ చేరింది. తొలి గేమ్ కోల్పోయినా అద్భుతమైన పోరాట పటిమతో తన కెరీర్లోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఇతర మ్యాచ్ల్లో టాప్ సీడ్ ఉన్నతి హుడా 21–-15, 21–-10తో తోటి షట్లర్ తస్నిమ్ మీర్పై అలవోకగా గెలవగా.. ఇషారాణి బారువా 21–-15, 21–-8 తో ఎనిమిదో సీడ్ పోలినా బుహ్రోవా (ఉక్రెయిన్)ను ఓడించింది.
మెన్స్ సింగిల్స్లో మూడో సీడ్ హెచ్ఎస్ ప్రణయ్కు షాక్ తగిలింది. యంగ్ స్టర్ మన్రాజ్ సింగ్ 21–-15, 21–-18తో ప్రణయ్ పని పట్టి క్వార్టర్స్ చేరగా.. వెటరన్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ 21–-6, 21–-16తో సనీత్ దయానంద్పై, మిథున్ మంజునాథ్ 21--–16, 17--–21, 21--–7తో ఆరో సీడ్ మన్నేపల్లి తరుణ్ పై గెలిచారు. డబుల్స్లో హరిహరన్– - ఎంఆర్ అర్జున్ 21–-12, 21–-18తో యి షెండ్– జె జైన్ (మలేసియా)పై నెగ్గగా, విమెన్స్ డబుల్స్లో టాప్ సీడ్ ట్రీసా జాలీ–పుల్లెల- గాయత్రి 21–-17, 21–-12తో ఇండియాకే చెందిన జెనిత్– లిఖితపై గెలిచి క్వార్టర్స్ చేరారు. మిక్స్డ్ డబుల్స్లో హరిహరన్–ట్రీసా ద్వయం 24-–22, 21–-15 రెండో సీడ్ రోహన్ కపూర్–- రుత్విక శివానికి షాకిచ్చింది.
