
వాషింగ్టన్: ఉక్రెయిన్తో యుద్ధం ఆపేలా రష్యాను అరికట్టడానికి భారత్పై సుంకాలు విధించిన ట్రంప్ నిర్ణయాన్ని అమెరికా హౌస్ విదేశాంగ కమిటీ డెమోక్రటిక్ ప్యానెల్ తీవ్రంగా విమర్శించింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న సాకుతో భారత్పై ట్రంప్ 50 శాతం అదనపు సుంకాలు విధించినంత మాత్రాన పుతిన్ ఆగడని, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపడానికి ఈ చర్య పెద్దగా ఉపయోగపడదని అభిప్రాయపడింది డెమొక్రాట్ ప్యానెల్.
‘‘రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తుందన్న కారణంతో భారత్పై సుంకాలు విధించడం వల్ల పుతిన్ ఆగడు. ఉక్రెయిన్పై రష్యా అక్రమ దండయాత్రను ట్రంప్ నిజంగా ఆపాలనుకుంటే.. ట్రంప్ నేరుగా రష్యాపై చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో ఉక్రెయిన్కు అవసరమైన సైనిక సహాయం అందించాలి. అంతేకానీ రష్యాకు ముకుతాడు వేయడానికి భారత్పై సుంకాలు విధించడం వంటి చర్యలన్నీ వేస్ట్’’ అని ట్రంప్ నిర్ణయాన్ని విమర్శించింది డెమొక్రాట్ ప్యానెల్. ట్రంప్-పుతిన్ అలస్కా భేటీ విషలమైతే భారత్పై మరికొన్ని అదనపు సుంకాలు విధిస్తామన్న అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ హెచ్చరికల తర్వాత డెమోక్రటిక్ ప్యానెల్ పై విధంగా స్పందించింది.
మూడేళ్లుగా సాగుతోన్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే రష్యాకు అడ్డుకట్ట వేయడానికి ఆ దేశంతో వాణిజ్యం చేయొద్దని పలు దేశాలను హెచ్చరించారు ట్రంప్. అయినప్పటికీ దేశ ప్రయోజనాల దృష్ట్యా భారత్ రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటోంది. ఈ చర్యలతో తీవ్ర ఆగ్రహానికి గురైన ట్రంప్ భారత్ పై 50 శాతం అదనపు సుంకాలు విధించాడు. అలస్కాలో జరిగే భేటీలో యుద్ధం ఆపడానికి పుతిన్ అంగీకరించకపోతే భారత్ పై మరికొన్ని అదనపు సుంకాలు విధిస్తామని అమెరికా హెచ్చరించింది. అయితే, ఈ భేటీ సానుకూలంగా జరగడంతో భారత్పై అదనపు సుంకాల వడ్డింపు నిర్ణయాన్ని ట్రంప్ విరమించుకున్నట్లు తెలుస్తోంది.