న్యూఢిల్లీ: ఏడు మెటల్ కంపెనీలను టాటా స్టీల్లో విలీనం చేస్తామని టాటా గ్రూప్ ప్రకటించింది. సామర్ధ్యం పెంచేందుకు, ఖర్చులు తగ్గించేందుకు తమ గ్రూప్లోని మెటల్ కంపెనీలను విలీనం చేస్తున్నామని వివరించింది. సబ్సిడరీ కంపెనీలయిన టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ (టీఎస్పీఎల్), టాటా మెటాలిక్స్, ది టిన్ప్లేట్ కంపెనీ ఆఫ్ ఇండియా, టీఆర్ఎఫ్ లిమిటెడ్, ఇండియన్ స్టీల్ అండ్ వైర్ ప్రొడక్ట్స్, టాటా స్టీల్ మైనింగ్, ఎస్ అండ్ టీ మైనింగ్ కంపెనీలను టాటా స్టీల్లో విలీనం చేసేందుకు ఈ కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. విలీనమైన కంపెనీల రీసోర్స్లను వాడుకొని షేరు హోల్డర్ల వాల్యూని మరింత పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని టాటా స్టీల్ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. విలీనం వలన సబ్సిడరీ కంపెనీల ఫెసిలిటీస్ను ఒకరికొకరు వాడుకోవడానికి వీలుంటుందని, కంపెనీల మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా విస్తరిస్తుందని తెలిపింది.
షేర్ల స్వాప్ విధానం ద్వారా టాటా స్టీల్లో ఏడు సబ్సిడరీలను విలీనం చేయనున్నారు. ఇందులో భాగంగా 10 టీఆర్ఎఫ్ షేర్లు ఉన్న ఇన్వెస్టర్కు 17 టాటా స్టీల్ షేర్లు, 10 టీఎస్ఎఫ్ఎల్ షేర్లు ఉన్న ఇన్వెస్టర్కు 67 టాటా స్టీల్ షేర్లను ఇష్యూ చేయనున్నారు. అలానే 10 టిన్ప్లేట్ షేర్లు ఉంటే 33 షేర్లు , 10 మెటాలిక్స్ షేర్లు ఉంటే 79 షేర్లు ఇష్యూ చేస్తారు. కాగా, విలీనం చేయాలనుకుంటున్న కంపెనీల్లో మెజార్టీ వాటా టాటా స్టీల్ చేతుల్లోనే ఉంది. ఎన్.చంద్రశేఖరన్ నాయకత్వంలోని టాటా గ్రూప్ తన కంపెనీలను విలీనం చేయడంపై ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది.
ఈ ఏడాది ప్రారంభంలో టాటా కన్జూమర్, టాటా కాఫీలు విలీనమవుతాయని టాటా గ్రూప్ ప్రకటించింది. ఎయిర్ ఇండియా కిందకు ఎయిర్ ఏషియా ఇండియా, విస్తారాలను 2024 లోపు తీసుకురావాలని కూడా కంపెనీ చూస్తోంది. విలీన ప్రకటన రావడంతో మార్కెట్లు నష్టాల్లో ఉన్నప్పటికీ టాటా స్టీల్ షేరు శుక్రవారం 0.77 % పెరిగి రూ.104.40 వద్ద క్లోజయ్యింది.