హైదరాబాద్, వెలుగు : భారత ఆర్థిక వ్యవస్థ కు పన్నులే వెన్నెముక అని, వీటిని చెల్లిస్తే మనదేశ ఎకానమీ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ జీవన్లాల్ లావిడియా అన్నారు. హైదరాబాద్లో బిజినెస్మింట్ నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పన్నులు సక్రమంగా చెల్లిస్తే, భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించగలదని అన్నారు. ప్రపంచ ఆర్థిక శక్తి కేంద్రంగా భారతదేశం ఆవిర్భవించేందుకు భారతీయ కార్పొరేట్ కంపెనీలు నాయకత్వం వహిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
కార్పొరేట్ వృద్ధికి భారతదేశంలో అనుకూలమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయని చెప్పారు. యువశక్తిని వాడుకోవాలని కార్పొరేట్ సంస్థలను జీవన్లాల్ కోరారు. సమాజానికి విశిష్ట సేవలు అందిస్తున్న 72 మందికి బిజినెస్ మింట్ ఆదివారం హైదరాబాద్లో అవార్డులు ప్రదానం చేసింది. ఈ వేడుకలకు జీవన్లాల్తో పాటు రాజ్యసభ ఎంపీ ఆర్. కృష్ణయ్య, ఏపీపీ ప్రదీప్ కుమార్ రెడ్డి, జేఎన్టీయూ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ కె. నరసింహా రెడ్డి, వీ-హబ్ సిఈఓ రావుల దీప్తి తదితరులు చీఫ్ గెస్టులుగా వచ్చారు.