తెలంగాణకు మరో ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ

తెలంగాణకు మరో ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ టీసీఎల్ తెలంగాణలో తన కార్యకలాపాలను ప్రారంభించనున్నది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన రిసోజెట్ సంస్ధతో కలసి కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ తెలంగాణలో ఏర్పాటు చేయనున్నది. ఈ మేరకు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో జూన్ 28వ తేదీ బుధవారం రిసోజెట్ తో టీసీఎల్ సంస్థ ప్రతినిధులు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. రిసోజెట్ తో కలిసి టీసీఎల్ ఒక జాయింట్ వెంచర్ సంస్థ రూపంలో ప్రపంచ స్థాయి కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.

కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ రంగంలో విస్తృత ఉత్పత్తుల శ్రేణిని కలిగిన టీసీఎల్ ఎలక్ట్రానిక్స్ తన ప్రధాన కేంద్రం అయిన చైనాలోని హెఫెయి నగరం తర్వాత విదేశంలో ఏర్పాటు చేస్తున్న తొలి తయారీ యూనిట్ ఇదే కావడం విశేషం. తొలుత వాషింగ్ మెషిన్లను తయారు చేసేందుకు ఉద్దేశించిన ఈ తయారీ కేంద్రం నుంచి సమీప భవిష్యత్తులో రిఫ్రిజిరేటర్లు, డిష్ వాషర్లను కూడా ఉత్పత్తి చేసేందుకు విస్తరించనున్నది. రంగారెడ్డిలోని రావిర్యాల్లో ఉన్న ఈ- సిటీలో ఏర్పాటు చేయనున్న  తయారీ యూనిట్ కోసం టీసీఎల్ సంస్ధ రూ.225 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నది. ఈ తయారీ యూనిట్ ద్వారా సుమారు 500 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు తొలిదశలోనే రానున్నాయి. 

రాష్ట్రానికి టీసీఎల్ కంపెనీని స్వాగతిస్తున్నట్లు తెలిపిన మంత్రి కేటీఆర్, తెలంగాణ రాష్ట్ర కంపెనీ అయిన రిసోజెట్ తన విస్తరణ ప్రణాళికలో భాగంగా టీసీఎల్ కంపెనీతో కలిసి ముందుకు వెళ్లడం విశేషం అన్నారాయన. రాష్ట్రం ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, ఇక్కడి నుంచి హైటెక్నాలజీ ఉత్పత్తుల తయారీకి అవకాశంఉన్నదని వెల్లడించారు. టీసీఎల్ కంపెనీ పెట్టుబడి ద్వారా రాష్ట్రం ఎలక్ట్రానిక్స్ రంగంలో తన స్థానాన్ని మరింత బలపపరుచుకుంటుందన్నారు. తెలంగాణ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీకి అత్యంత అనువైన ప్రాంతమని, టీసీఎల్ కంపెనీ ఇక్కడ తమ ఉత్పత్తులను తయారు చేసేందుకు ముందుకు రావడమే ఇందుకు నిదర్శనమన్నారు కేటీఆర్. 

అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్న రిసోజెట్ కంపెనీ ఎండీ రమీందర్ సింగ్ సోయిన్, టీసీఎల్ ప్రతినిధులకు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. టీసీఎల్ తయారీ యూనిట్ కు అవసరమైన అన్ని రకాల సహకారం రాష్ట్రం ప్రభుత్వం అందిస్తుందని భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరాన్ని షెన్జన్ ఆఫ్ ఇండియాగా మార్చేందుకు సిద్ధంగా ఉన్నదని, ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలను, టీసీఎల్ సంస్థ చైర్మన్ జువాన్ డూ కు మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించారు మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ తయారీ విధానానికి ఉన్న అనుకూల పరిస్థితులు, మౌలిక వసతుల రంగంలో ఉన్న సౌకర్యాలను పరిశీలించేందుకు రాష్ట్రంలో పర్యటించాలని ఆమెను తెలంగాణకు కేటీఆర్ ఆహ్వానించారు.