న్యూఢిల్లీ: మనదేశంలో ఉద్యోగులకు బెస్ట్ వర్క్ప్లేస్గా టీసీఎస్ నిలిచింది. తరువాత స్థానాల్లో అమెరికన్ కంపెనీలు అమెజాన్, మోర్గాన్ స్టాన్లీ ఉన్నాయి. ఇండియాలో ఉద్యోగం చేయడానికి అత్యంత అనువైన 25 కంపెనీల లిస్టును సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్డ్ఇన్ రూపొందించింది. గ్రోత్కు, స్కిల్స్కు, స్టెబిలిటీకి ఉన్న అవకాశాలు, జెండర్ డైవర్సిటీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇండియాలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా ఇది కంపెనీలకు ర్యాంకులు కేటాయించింది. ఈ ఏడాది లిస్టులో ఆర్థిక సేవలు, క్రూడాయిల్ & గ్యాస్, ప్రొఫెషనల్ సర్వీసెస్, తయారీ, గేమింగ్లోని కంపెనీలు ఎక్కువగా ఉండగా కిందటి ఏడాది టెక్ కంపెనీలు ఎక్కువగా ఉన్నాయని లింక్డ్ఇన్ తన నివేదికలో పేర్కొంది.
మొత్తం- 25 కంపెనీల్లో 10 కంపెనీలు ఆర్థిక సేవలు, బ్యాంకింగ్, ఫిన్టెక్ స్పేస్కు చెందినవి. వీటిలో మాకరీ గ్రూప్ (5), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (11), మాస్టర్ కార్డ్ (12), యూబీ (ఇది వరకు క్రెడ్ ఎవెన్యూ) (14) ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఈ–స్పోర్ట్స్ గేమింగ్ నుండి డ్రీమ్11, గేమ్స్ 24x7 వంటి కంపెనీలు జాబితాలోకి వచ్చాయి. లింక్డ్ఇన్ టాప్ స్టార్టప్ లిస్ట్ ఆఫ్ ది ఇయర్లో ఉన్న జెప్టో ఈ జాబితాలో కూడా 16వ స్థానాన్ని సంపాదించుకోగలిగింది. 25 కంపెనీలలో కొత్తగా17 కంపెనీలు ఈ జాబితాలోకి ప్రవేశించాయని లింక్డ్ఇన్ తెలిపింది.
ఈ స్కిల్స్కు ఎక్కువ డిమాండ్
టెక్నాలజీ రంగానికి చెందిన కంపెనీలు కేండిడేట్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్, ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ టెస్టింగ్, కంప్యూటర్ సెక్యూరిటీ వంటి స్కిల్స్ కోసం వెతుకుతున్నాయి. ఫైనాన్షియల్ సెక్టార్లో, కంపెనీలు కమర్షియల్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, గ్రోత్ స్ట్రాటజీలలో నైపుణ్యం ఉన్న ఉద్యోగుల కోసం చూస్తున్నాయి. ఇంజినీరింగ్, కన్సల్టింగ్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, బిజినెస్ డెవలప్మెంట్, సేల్స్, డిజైన్, ఫైనాన్స్, ఆపరేషనల్ జాబ్ ఫంక్షన్స్ కోసం పెద్ద కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. టాప్ కంపెనీలు ట్యాలెంట్కోసం ఎక్కువగా వెతుకుతున్న నగరాల్లో బెంగళూరు మొదటిస్థానంలో ఉంది. తర్వాత స్థానాల్లో ముంబై, హైదరాబాద్, ఢిల్లీ పుణే ఉన్నాయి.
‘‘ప్రస్తుతం పరిస్థితులు కొంత గందరగోళంగా ఉన్నాయి. ఏ కంపెనీలో చేరితే గ్రోత్ బాగుంటుందనే విషయమై ప్రొఫెషనల్స్ విపరీతంగా ఎంక్వైరీ చేస్తున్నారు. లాంగ్ టర్మ్ సక్సెస్ ఇచ్చే కంపెనీలు కూడా తమకు ముఖ్యమని చెబుతున్నారు’’ అని లింక్డ్ఇన్ కెరీర్ ఎక్స్పీర్ ఇండియా ఎండీ నీరాజితా బెనర్జీ చెప్పారు.