
TCS News: రోజురోజుకూ ఐటీ పరిశ్రమలో పరిస్థితులు కూడా బాగా దిగజారిపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలు ఉద్యోగులను ఉన్నపళంగా తొలగిస్తుంటే.. భారతీయ టెక్ కంపెనీలు మాత్రం కొంచెం భిన్నంగా నిబంధనలను కఠినతరం చేస్తూ ముందుకెళుతున్నాయి. ఈ క్రమంలో టెక్ దిగ్గజ సంస్థలు తీసుకుంటున్న నిర్ణయాలు టెక్కీలకు కొత్త కష్టకాలాన్ని సూచిస్తున్నాయి.
తాజాగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తన కొత్త పాలసీ కింద ఉద్యోగులకు ఏడాదికి బెంచ్ మీద ఉండే కాలాన్ని గరిష్ఠంగా 35 రోజులకు పరిమితం చేస్తు్నట్లు ప్రకటించింది. అంటే దీని ప్రకారం సదరు ఉద్యోగులు ఏడాదిలో 225 రోజులు ప్రాజెక్టులపై పనిచేయాల్సిందే. కొత్త రూల్స్ జూన్ 12, 2025 నుంచి అమలులోకి వస్తాయని కంపెనీ స్పష్టం చేసింది.
అయితే ఎక్కువ కాలం ఏ వర్క్ లేదా ప్రాజెక్ట్ అలాట్ కాకుండా బెంచ్ మీద ఉంటే కొత్త నిబంధనల ప్రకారం ఉద్యోగులకు ఆర్థిక నష్టాన్ని కలిగించవచ్చని టీసీఎస్ రిసోర్స్ మేనేజ్మెంట్ గ్రూప్ గ్లోబల్ హెడ్ చంద్రశేఖరన్ రామ్ కుమార్ వెల్లడించారు. పైగా ఈ పరిస్థితులు ఉద్యోగి కెరీర్, అంతర్జాతీయ పోస్టింగ్ పై ప్రభావాన్ని చూపటంతో పాటు ఉద్యోగం కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని అన్నారు.
అయితే ఎలాంటి ప్రాజెక్ట్ లేదా వర్క్ అలాట్ కాని ఉద్యోగులు తమను తాము అప్ స్కిల్లింగ్ చేసుకునేందుకు ఆ సమయాన్ని ఇకపై ఉపయోగించుకోవాల్సి ఉంటుందని కంపెనీ చెబుతోంది. బెంచ్ మీద ఉన్న కాలంలో ఉద్యోగులు రోజుకు 4 నుంచి 6 గంటల సమయాన్ని తమ అప్ స్కిల్లింగ్ కోసం ఐ ఇవాల్స్, ఫ్రెస్కో ప్లే, విఎల్ఎస్, లింక్డిన్, మ్యాన్డేటరీ ట్రైనింగ్ వంటి వాటిపై గడపాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కంపెనీ జనరేటివ్ ఏఐ ఇంటర్వ్యూ కోచ్ కూడా ఉపయోగించాలి. అలాగే వేగంగా ప్రాజెక్టుల్లో ప్లేస్ చేయటానికి ఆఫీసుకు రావటాన్ని కూడా ఒక ప్రామాణికతగా కంపెనీ తీసుకుంటోంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా ఫ్లెక్సిబిలిటీలను అందించనుంది.