ఏడాదిలోపు టీడీపీ క్లోజవుతది: రాం మాధవ్

ఏడాదిలోపు టీడీపీ క్లోజవుతది: రాం మాధవ్

అమరావతి, వెలుగు: ఏడాది పూర్తి కాకుండానే ఏపీలో టీడీపీ పూర్తిగా కనుమరుగవుతుందని, విదేశాల్లో తానా కార్యక్రమాలు చేసుకోవడానికే అది పరిమితమవుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ అన్నారు. తెలంగాణతో ధీటుగా ఏపీలో బీజేపీని బలోపేతం చేస్తామని చెప్పారు. 2024 ఎన్నికల నాటికి మెజార్టీ ఓటింగ్ సాధించే స్థాయికి చేరుకుంటామన్నారు. ఆదివారం మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తో కలిసి గుంటూరు, విజయవాడల్లో ఏర్పాటు చేసిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఆత్మీయ సమ్మేళన్, పదాధికారుల సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. “ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. మా పార్టీలో కుల, గ్రూపు రాజకీయాలు లేవు. కష్టపడి పనిచేసే వారికే పెద్దపీట. ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చేవారికి మా పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి.
తెలంగాణలో క్రమేపి బలపడుతున్నాం. ఏపీలోనూ పార్టీ బలపడటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చంద్రబాబు సర్కారులో జరిగిన అవినీతి, అక్రమాలపై కోపంతోనే ప్రజలు వైఎస్సార్ సీపీకి ఓట్లేశారు. టీడీపీ స్థానంలో త్వరలోనే బలమైన ప్రతిపక్షంగా బీజేపీ నిలుస్తుంది” అని అన్నారు. ఏపీలో ఈ ఏడాది 25 లక్షలకు పైగా సభ్యత్వ నమోదే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

కాంగ్రెస్ గతే టీడీపీకి పడుతుంది: శివరాజ్ సింగ్

ఏపీలో కాంగ్రెస్ మాదిరిగానే టీడీపీ కూడా త్వరలో ఖాళీ అవుతుందని మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఏపీకి కేంద్రం ఇచ్చిన రూ. 17 వేల కోట్ల ప్యాకేజీని చంద్రబాబు జేబులోకి వేసుకున్నారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ప్యాకేజీ ఇవ్వలేదని ఎన్నికల్లో విషప్రచారం చేశారన్నారు. హోదా వద్దని, ప్యాకేజీ చాలని చంద్రబాబు స్వయంగా లేఖ రాశారని గుర్తు చేశారు. మోడీపై ఉన్న కోపంతో కేంద్రంలో చక్రం తిప్పుతానన్న చంద్రబాబను ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారన్నారు. ఏపీలో కాంగ్రెస్ కు పట్టిన గతే టీడీపీకి పడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర ముగిసిందని, ప్రస్తుతం నకిలీ గాంధీలతో అది నిండిపోయిందని విమర్శించారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని నడపలేక అధ్యక్ష పదవి నుంచి పారిపోయారని, ఆయన బాటలోనే ఏపీ సహా పలు రాష్ర్టాల పీసీసీ చీఫ్ లు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారన్నారు.

బాబువి అధర్మ పోరాట దీక్షలు: సుజనా

ప్రజాధనంతో మాజీ సీఎం చంద్రబాబు అధర్మ పోరాట దీక్షలు చేశారని కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి విమర్శించారు. ఇటీవల టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఆయన మొదటిసారి ఏపీ వచ్చారు. పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన్ లో పాల్గొన్నారు. ఏపీలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.