ప్రతి స్టూడెంట్​కీ టీచరే హీరో

ప్రతి స్టూడెంట్​కీ టీచరే హీరో

స్టూడెంట్స్​ జీవితంలో పేరెంట్స్​ తర్వాతి స్థానం గురువు​దే. తల్లి జీవితాన్ని ప్రసాదిస్తే, తండ్రి ఆ జీవితంపై నమ్మకం పెంచుతాడు. గురువు చదువు చెప్పి భవిష్యత్​ని తీర్చిదిద్దుతాడు. అందుకే స్టూడెంట్స్​ తమ లైఫ్​లో తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన, గౌరవించుకోవాల్సిన వ్యక్తి టీచర్​. పుస్తకాల్లోని పాఠాలతోపాటు తాము అనుభవం ద్వారా పొందిన విషయాలను కూడా క్లాస్​ రూమ్​ల్లో నేర్పితే వాటిని పిల్లలు లైఫ్​లాంగ్​ మర్చిపోరు. స్టూడెంట్స్ ​పైన, తద్వారా సమాజం పైన తమదైన ముద్ర వేయగల గొప్ప అవకాశం టీచర్లకు మాత్రమే ఉంది.

ఒకప్పుడు టీచింగ్​ని పవిత్రంగా భావించేవారు. నలుగురూ చూసి నేర్చుకోవాల్సిన వ్యక్తి అంటూ బడి పంతుల్ని ఆదర్శంగా చూపేవారు. పిల్లలు ఇంట్లో అల్లరి చేస్తే ‘రేపు మీ సార్​కి చెబుతా ఉండు’ అంటూ తల్లిదండ్రులు హెచ్చరించి క్రమశిక్షణగా పెంచేవారు. ఇప్పుడు ఆ ‘బెదిరింపుల’ ప్లేస్​లోకి హోం వర్క్​ వచ్చి చేరింది. హోం వర్క్​ చేయకపోతే టీచర్​ ఏమైనా అంటారేమోననే భయంతో, బెంగతో స్టూడెంట్స్​ వాళ్లంతటవాళ్లే పద్ధతిగా నడుచుకుంటున్నారు. బుద్ధిగా వాళ్ల పని వాళ్లు చేసుకుంటున్నారు.

దీన్నిబట్టి స్టూడెంట్స్​ బిహేవియర్​ను డైరెక్ట్​గా, ఇన్​డైరెక్ట్​గా ప్రభావితం చేస్తున్న వ్యక్తి టీచర్​ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హోం వర్క్​ బాగా చేసినప్పుడు టీచర్​ మెచ్చుకుంటే పిల్లలు తెగ సంబరపడిపోతారు. ‘గుడ్’, ‘వెరీ గుడ్’​ వంటి రిమార్క్​లకు వాళ్ల రియాక్షనే మారిపోతుంది. రేపు ఇంకా బాగా హోం వర్క్​ చేయాలనే ఉత్సాహం వస్తుంది. క్లాస్​లు​ పెరుగుతున్నకొద్దీ టీచర్లు స్టూడెంట్స్​కి ఫ్రెండ్స్​లా, ఫిలాసఫర్​లా, గైడ్​లా వ్యవహరించాలి. అలాంటి వారే పిల్లలతో ‘ది బెస్ట్’ అని, ‘ఆల్​రౌండ్​ మెంటార్​’ అని అనిపించుకోగలరు. ​

రోజులు, ప్రభుత్వాలు మారుతుండటంతో చదువు రూటు మారి వ్యాపారమైంది. గవర్నమెంట్​ టీచర్లకు అసలు డ్యూటీకి బదులు కొసరు పనులు పెరిగాయి. దీంతో వారికి.. పిల్లలకు చదువు చెప్పే టైం దొరకట్లేదు. ఫలితంగా వాళ్లు పాఠాలు నేర్చుకోవటంలో వెనకబడుతున్నారు. ఈ విషయం అనేక రిపోర్టుల్లో, స్టడీల్లో తేలింది. ఈ పరిస్థితిని మార్చటానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నా పెద్దగా ఫలితం కనిపించట్లేదు. బాధ్యత మాదికాదంటే మాది కాదంటూ సర్కార్లు, టీచర్లు ఒకరిపైఒకరు తోసేసుకుంటూ కాలం వెళ్లదీయటం సరికాదు.

ఈరోజుల్లో టీచింగ్​ ఒక బతుకు దెరువులా మారిన మాట నిజం. ఒకప్పుడు బతకలేనోడు బడిపంతులనేవారు. ఇప్పుడు బతక నేర్చినవాడు బడి పంతులు అంటున్నారు. కారణం కొందరు టీచర్లు స్కూల్లో డ్యూటీలో ఉండే ఫోన్​లో ఏవేవో వ్యాపారాలను చక్కబెడుతున్నారు. అలాంటి  కొద్ది మంది వల్ల టీచింగ్​ వృత్తికి చెడ్డ పేరు వస్తోంది. అయితే ఈ వృత్తిని మనసారా ప్రేమించేవారు ఈనాటికీ ఎంతో మంది ఉన్నారు. ‘న్యూ ఎడ్యుకేషన్​ పాలసీ డ్రాఫ్ట్​–2019’పై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

స్కూల్స్​లోని పిల్లల్లో నేర్చుకునే తత్వాన్ని పెంచటానికి పాలకులు, టీచర్లు, సొసైటీ చిత్తశుద్ధితో కృషి చేయాలి. అ, ఆ లు; ఇ, ఈ లు.. ఒకట్లూ రెండ్లూ, ఏబీసీడీలు.. ఇలా మినిమం నాలెడ్జ్​ ప్రతి స్టూడెంట్​లోనూ డెవలప్​ అయ్యేలా చూడాలి. ప్రతిఒక్కరికీ చూసి చదవటం, రాయటం వచ్చేలా తీర్చిదిద్దటం అవసరం. ఇలా చేయలేకపోతే విద్యా వ్యవస్థకే తలవంపులా మారుతుంది. భవిష్యత్​ తరాలు క్షమించవు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా టీచింగ్​ పద్ధతుల్లో, సిలబస్​​లో మార్పులు మంచిది కాదు.

విద్యా రంగానికి సర్కారు సరిపోను బడ్జెట్​ ఇచ్చి, టీచర్ల సమస్యలను వెంటవెంటనే పరిష్కరించాలి. టీచర్లు యూనియన్ల వారీగా విడిపోకూడదు. అలాగే ఎప్పటికప్పుడు తమ నాలెడ్జ్​ పెంచుకుంటూ ఉండాలి. కామన్ స్కూల్ విధానం ద్వారా కొత్త పద్ధతుల్లో చదువు నేర్పటానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే టీచర్స్​ డేకి నిజమైన అర్థం, పరమార్థం.

– మేకిరి దామోదర్

 

(ఇవాళ టీచర్స్​ డే)