హైదరాబాద్/రంగారెడ్డి,వెలుగు: స్టూడెంట్లలో నైతిక విలువలు, దేశభక్తి భావాలు పెంపొందించడంలో టీచర్ల పాత్ర కీలకమనీ టీచర్ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి అన్నారు. ఘట్కేసర్ లోని అన్నోజిగూడలో రెండ్రోజులుగా జరుగుతున్న తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏవీఎన్ రెడ్డి మాట్లాడుతూ... దేశ ఉజ్వల భవిష్యత్తు నిర్మాణంలో ఉన్నత వ్యక్తిత్వం గల స్టూడెంట్లను తయారుచేయాలని టీచర్లను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై నిర్లక్ష్యంగా ఉందన్నారు. విద్యారంగంలో పలు ఖాళీలు భర్తీకాకుండా అనేక ఏండ్లుగా పెండింగ్లో ఉన్నాయని చెప్పారు.
బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియలో న్యాయపరమైన వివాదాలు తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు. మన ఊరు– మన బడి స్కీమ్ కు ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రతి స్కూల్ లో స్కావెంజర్ ను నియమించాలన్నారు. కార్యక్రమంలో ఏవీఆర్ఎస్ఎం జాతీయ సహా సంఘటన కార్యదర్శి గుంత లక్ష్మణ్, తపస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు హనుమంతరావు, నవాత్ సురేష్, ఏబీఆర్ఎస్ఎం ప్రతినిధులు పాలేటి వెంకట్రావు, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.