ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన టీచర్లు

ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన టీచర్లు

స్పౌజ్ బదిలీలు చేపట్టాలని కోరుతూ ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన టీచర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. జీవో నెం.17 వల్ల చిన్న పిల్లలకు ఇంట్లో వాళ్లకు దూరమవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. తామంతా కేసీఆర్ బిడ్డలమని, సమస్యలు చెప్పుకోవడానికి మాత్రమే వచ్చామని స్పష్టం చేశారు. పోలీసులు మమ్మల్ని అక్రమంగా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఏ అధికారిని అడిగినా ఫలితం లేదన్న టీచర్లు... అందుకే ప్రగతి భవన్ వచ్చామని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం జీవో 317పై పునరాలోచన చెయ్యాలని కోరారు. జీవో నెం. 317 వల్ల 2017 బ్యాచ్ మొత్తం నరకం అనుభవిస్తున్నారని, చదివింది ఒక జిల్లా అయితే.. ఉద్యోగం వందల కిలోమీటర్ల దూరంలో ఉందని వాపోయారు. ప్రతీ రోజు ప్రయాణం చేసి అనారోగ్యంతో బాధపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన చీకటి జీవోను వెంటనే రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు. టీచర్ల యూనియన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, యూనియన్ ధ్వంద్వ వైఖరి చూపిస్తోందని ఆరోపించారు. కేసీఆర్ ఇప్పటికైనా తమ గోడు వినాలని టీచర్ల ఆందోళన వ్యక్తం చేశారు.

అంతకుముందు స్పౌజ్ బదిలీలు చేపట్టాలని కోరుతూ టీచర్​ దంపతులు, పిల్లలతో కలిసి లక్డీకాపూల్‌‌‌‌లోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్‌‌‌‌ను ముట్టడించారు. తమ ఆవేదనను సర్కారుకు తెలిపేందుకు మౌన దీక్ష చేపట్టినట్లు పేర్కొన్నారు. ‘ముఖ్యమంత్రి మాటే ముద్దు.. దంపతులు విడిగా వద్దు..’, ‘దంపతుల్ని కలపండి.. సీఎం మాటను నిలపండి’అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. భర్త ఒక జిల్లాలో, భార్య మరో జిల్లాలో విధులు నిర్వహించడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. టీచర్ల ఆందోళన నేపథ్యంలో డైరెక్టరేట్ ఆఫీసు ముందు పోలీసులు భారీగా మోహరించారు. చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ట్రాఫిక్ జామ్ అయింది. నిరసనకు పర్మిషన్ లేదని పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా, టీచర్లు ప్రతిఘటించారు. ఈ క్రమంలో పోలీసులకు, టీచర్లకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పలువురు టీచర్లపై పోలీసులు చేయి చేసుకున్నారు. టీచర్ల పిల్లలు ఏడుస్తున్నా పోలీసులు పట్టించుకోకుండా అరెస్టు చేశారు.