న్యూఢిల్లీ : సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం టీమిండియా ప్రిపరేషన్స్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా సోమవారం తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. యంగ్ పేసర్లు ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్ నెట్స్లో తీవ్రంగా చెమటోడ్చారు. అయితే యార్కర్స్ వేయడంలో అర్ష్దీప్.. ఉమ్రాన్ను మించిపోయాడు. కానీ ఫైనల్ ఎలెవన్లో ఈ ఇద్దరికి చోటు దక్కడం కష్టంగానే ఉంది. భువనేశ్వర్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్తో పేస్ బౌలింగ్ కోటా పూర్తయింది. సాయంత్రం జరిగిన సెషన్ను చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, పారస్ మాంబ్రే పర్యవేక్షించారు. ఉమ్రాన్ బౌలింగ్లో పంత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. షార్ట్ స్పెల్లో అర్ష్దీప్.. మిడిల్ స్టంప్ను లక్ష్యంగా చేసుకుని పర్ఫెక్ట్ యార్కర్లు వేశాడు. కేఎల్ రాహుల్, రుతురాజ్, ఇషాన్, వెంకటేశ్ అయ్యర్ నెట్ సెషన్లో పాల్గొన్నారు. రిథమ్ కోసం పేసర్లందరూ కాసేపు మాత్రమే ప్రాక్టీస్ చేశారు. దినేశ్ కార్తీక్ కూడా కొద్దిసేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసి ల్యాప్ స్కూప్, రివర్స్ ల్యాప్ స్కూప్ షాట్లు కొట్టాడు. కాగా, హార్దిక్ పాండ్యా మంగళవారం టీమ్లో చేరనున్నాడు.