వన్డేలు, టీ20ల్లో నెంబర్ వన్ గా నిలిచిన టీమిండియా ..తాజాగా టెస్టుల్లోనూ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్లో భారత జట్టు నెంబర్ వన్గా నిలిచింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాపై తొలి టెస్టులో విజయం సాధించడంతో 115 రేటింగ్ పాయింట్లు సాధించిన రోహిత్ శర్మ సేన మొదటి స్థానాన్ని దక్కించుకుంది. భారత జట్టు చేతిలో ఓడిన ఆసీస్..111 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది. ఈ ర్యాంకింగ్స్ లో 106 పాయింట్లతో ఇంగ్లాండ్ మూడో స్థానంలో, 100 పాయింట్లతో న్యూజిలాండ్ నాల్గో స్థానంలో, 85 పాయింట్లతో సౌతాఫ్రికా ఐదో స్థానంలో ఉన్నాయి.
ఏకైక కెప్టెన్ రోహిత్ శర్మ
టెస్టు ర్యాంకింగ్స్ లో టీమిండియా అగ్రస్థానాన్ని దక్కించుకోవడంతో కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. మూడు ఫార్మాట్లలో ఐసీసీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని అందుకున్న కెప్టెన్గా నిలిచాడు. ఇక క్రికెట్ చరిత్రలోనే ఏకకాలంలో మూడు ఫార్మాట్లలో నెంబర్ వన్ స్థానాన్ని అందుకున్న తొలి కెప్టెన్గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో భారత జట్టు వన్డే, టెస్ట్, టీ20ల్లో అగ్రస్థానాన్ని అందుకున్నా...ఏక కాలంలో మూడు ఫార్మాట్లలో టాప్ ర్యాంక్ ను సాధించలేదు.