- సూర్యకుమార్ హాఫ్ సెంచరీ వృథా
- సఫారీలను గెలిపించిన ఎంగిడి, మార్క్రమ్, మిల్లర్
పెర్త్: కీలక సమయాల్లో మూడు రనౌట్స్.. రెండు క్యాచ్లు మిస్ చేసిన ఇండియా టీమ్.. టీ20 వరల్డ్కప్లో భారీ మూల్యం చెల్లించుకుంది. గెలిస్తే సెమీస్ బెర్త్ ఖాయమయ్యే మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు బ్యాట్లెత్తేశారు. ఇన్నింగ్స్ మొత్తంలో 8 మంది సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం కావడంతో.. ఆదివారం జరిగిన సూపర్–12, గ్రూప్–2 లీగ్ మ్యాచ్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా చేతిలో కంగుతిన్నది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇండియా 20 ఓవర్లలో 133/9 స్కోరు చేసింది. తర్వాత సఫారీ జట్టు 19.4 ఓవర్లలో 137/5 స్కోరు చేసి నెగ్గింది. ఎంగిడికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
ఎంగిడి జోరు..
బౌన్సీ పిచ్పై ఆరంభం నుంచే ఇండియాకు ఏదీ కలిసి రాలేదు. సఫారీ బౌలర్లు పార్నెల్ (3/15), నోర్జ్ (1/23), ఎంగిడి (4/29) చేసిన ఎదురుదాడిలో టీమిండియా టాపార్డర్ చెల్లాచెదురైంది. ముఖ్యంగా ఎంగిడి బ్యాక్ లెంగ్త్ డెలివరీస్కు... ఐదు ఓవర్లు కూడా ముగియకముందే ఓపెనర్లు రోహిత్ (15), రాహుల్ (9) పెవిలియన్కు చేరారు. ఏడో ఓవర్లో కోహ్లీ (12), తర్వాతి రెండు ఓవర్లలో దీపక్ హుడా (0), హార్దిక్ పాండ్యా (2) ఔట్ కావడంతో ఇండియా 49/5 స్కోరుతో పీకల్లోతు కష్టాల్లో పడింది. కోహ్లీ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ ఫామ్ను కంటిన్యూ చేశాడు. ఓ ఎండ్లో టీమ్ మేట్స్ తక్కువ స్కోరుకే వెనుదిరిగినా.. రెండో ఎండ్లో సూర్య నిలకడగా ఆడాడు. నోర్జ్, మహారాజ్, ఎంగిడి ఓవర్లలో మూడు చూడముచ్చటైన సిక్సర్లు బాదాడు. దినేశ్ కార్తీక్ (6) రన్స్ చేయకపోయినా.. సూర్యకు అండగా నిలిచాడు. దీంతో ఆరో వికెట్కు 52 రన్స్ జతయ్యాయి. ఈ దశలో పార్నెల్.. ఇండియాకు ట్రిపుల్ స్ట్రోక్ ఇచ్చాడు. తన వరుస ఓవర్లలో కార్తీక్, అశ్విన్ (7), సూర్యను పెవిలియన్కు పంపాడు. చివర్లో భువనేశ్వర్ (4 నాటౌట్), షమీ (0), అర్ష్దీప్ (2 నాటౌట్) బ్యాట్లు కూడా నిరాశ పరచడంతో ఇండియా చిన్న టార్గెట్నే నిర్దేశించింది.
మిల్లర్, మార్క్రమ్ మెరుపులు
ఛేజింగ్ ఆరంభంలో ఇండియా బౌలర్లు ఆకట్టుకున్నారు. అర్ష్దీప్ (2/25) రెండో ఓవర్లోనే డికాక్ (1), రోసో (0)ను ఔట్ చేయగా, ఆరో ఓవర్లో షమీ (1/13).. బవూమ (10)ను పెవిలియన్కు పంపాడు. దీంతో 24/3 స్కోరుతో కష్టాల్లో పడిన ప్రొటీస్ను మార్క్రమ్, డేవిడ్ మిల్లర్ ఆదుకున్నారు. భారీ షాట్లకు పోకుండా సింగిల్స్, డబుల్స్తో పాటు వీలైనప్పుడు బౌండ్రీలు రాబట్టారు. దీంతో పవర్ప్లేలో 24/3 ఉన్న స్కోరు సగం ఓవర్లకు 40/3 కు చేరింది. అయితే 11వ ఓవర్లో సూర్య కొట్టిన డైరెక్ట్ త్రో మిస్ కావడంతో మార్క్రమ్ గట్టెక్కాడు. అప్పటికీ జట్టు స్కోరు 56/3గానే ఉంది. కానీ ఇక్కడే ఇండియా ఫీల్డింగ్ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. తర్వాతి రెండు ఓవర్లలో కోహ్లీ క్యాచ్ డ్రాప్ చేసి, రోహిత్ ఈజీ రనౌట్ మిస్ చేసి మార్క్రమ్, మిల్లర్లకు లైఫ్ ఇచ్చి మూల్యం చెల్లించుకున్నారు. ఈ గండాల నుంచి గట్టెక్కిన మార్క్రమ్, మిల్లర్.. 14వ ఓవర్లో చెరో సిక్సర్తో ఒత్తిడిని అధిగమించారు. ఇదే జోష్లో 15వ ఓవర్లో మార్క్రమ్ గాలిలోకి లేపిన బాల్ను డీప్ వికెట్లో ఇద్దరు ఫీల్డర్లు నువ్వా–నేనా అంటూ వదిలేశారు. ఈ క్రమంలో అతను 39 బాల్స్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అయితే డెత్ ఓవర్స్లో మళ్లీ బౌలింగ్కు వచ్చిన పాండ్యా.. ఓ షార్ట్ లెంగ్త్తో మార్క్రమ్ను ఔట్ చేయడంతో నాలుగో వికెట్కు 76 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. తర్వాత వచ్చిన స్టబ్స్ (6) తొందరగానే వెనుదిరిగినా.. మిల్లర్ కిల్లర్గా మారాడు. 18 బాల్స్లో 25 రన్స్ అవసరమైన దశలో 18వ ఓవర్ (అశ్విన్)లో తొలి రెండు బాల్స్ను రెండు సూపర్ సిక్సర్లుగా మలిచాడు. నాలుగో బాల్కు స్టబ్స్ ఔటైనా, తర్వాతి ఓవర్లో ఫోర్తో మిల్లర్ జోరు కొనసాగించాడు. లాస్ట్ ఓవర్లో ఆరు రన్స్ అవసరం కాగా రెండు ఫోర్లతో మరో రెండు బాల్స్ మిగిలి ఉండగానే లాంఛనం పూర్తి చేశాడు.
పెర్త్ బౌన్సీ పిచ్పై సఫారీ పేసర్ల సూపర్ స్వింగ్కు టీమిండియా బ్యాటర్లు బొక్కా బోర్లా పడ్డారు..! సూర్యకుమార్ యాదవ్ (40 బాల్స్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 68) మినహాయిస్తే మిగతా వారు కనీసం పోరాట స్ఫూర్తి కూడా చూపెట్టలేక పోయారు..! చిన్న టార్గెట్ను కాపాడే ప్రయత్నంలో బౌలర్లు చివరి వరకు పోరాడినా.. ఫీల్డింగ్ వైఫల్యం ఇండియాను ఘోరంగా దెబ్బకొట్టింది..! దీంతో రెండు వరుస విజయాల తర్వాత టీ20 వరల్డ్కప్లో రోహిత్సేన తొలి ఓటమిని మూటగట్టుకుంది..! మరోవైపు ఎంగిడి (4/29) స్వింగ్కు, మిల్లర్ (46 బాల్స్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 59 నాటౌట్), మార్క్రమ్ (41 బాల్స్లో 6 ఫోర్లు, 1 సిక్స్తో 52) మెరుపులు తోడుకావడంతో గ్రాండ్ విక్టరీ కొట్టిన సౌతాఫ్రికా గ్రూప్–2లో టేబుల్ టాపర్గా నిలిచింది.!
కోహ్లీ అలా.. రోహిత్ ఇలా
ఫీల్డ్లో చురుగ్గా ఉండే కోహ్లీ, రోహిత్ ఈ మ్యాచ్లో తడబడ్డారు. అశ్విన్ వేసిన 12వ ఓవర్లో మార్క్రమ్ ఇచ్చిన క్యాచ్ డీప్ మిడ్ వికెట్లో కోహ్లీ చేతిలో పడినా.. సరిగ్గా బ్యాలెన్స్ చేయలేక డ్రాప్ చేశాడు. రెండు అడుగులు వెనక్కి జారిపోవడంతో విరాట్ డైవ్ చేసినా బాల్ అందలేదు. తర్వాతి ఓవర్లో మరో అద్భుతమైన చాన్స్ను రోహిత్ వృథా చేశాడు. షమీ బాల్ను మిల్లర్ డిఫెన్స్ చేసి రన్ కోసం పరుగెత్తాడు. కవర్స్లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ బాల్ అందుకుని త్రో చేశాడు. కానీ అది మిస్ అయ్యింది. ఒకవేళ పరుగెత్తుకు వెళ్లి రనౌట్ చేసినా వికెట్ దక్కేది. కానీ హిట్మ్యాన్ నిర్లక్ష్యం మరో వికెట్ను చేజార్చింది.
స్కోరు బోర్డు
ఇండియా: రాహుల్ (సి) మార్క్రమ్ (బి) ఎంగిడి 9, రోహిత్ (సి అండ్ బి) ఎంగిడి 15, కోహ్లీ (సి) రబాడ (బి) ఎంగిడి 12, సూర్యకుమార్ (సి) కేశవ్ (బి) పార్నెల్ 68, దీపక్ హుడా (సి) డికాక్ (బి) నోర్జ్ 0, హర్దిక్ పాండ్యా (సి) రబాడ (బి) ఎంగిడి 2, దినేశ్ కార్తీక్ (సి) రొసో (బి) పార్నెల్ 6, అశ్విన్ (సి) రబాడ (బి) పార్నెల్ 7, భువనేశ్వర్ (నాటౌట్) 4, షమీ (రనౌట్) 0, అర్ష్దీప్ సింగ్ (నాటౌట్) 2, ఎక్స్ట్రాలు: 8, మొత్తం: 20 ఓవర్లలో 133/9. వికెట్లపతనం: 1–23, 2–26, 3–41, 4–42, 5–49, 6–101, 7–124, 8–127, 9–130. బౌలింగ్: పార్నెల్ 4–1–15–3, రబాడ 4–0–26–0, ఎంగిడి 4–0–29–4, నోర్జ్ 4–0–23–1, కేశవ్ మహారాజ్ 3–0–28–0, మార్క్రమ్ 1–0–5–0.
సౌతాఫ్రికా: డికాక్ (సి) రాహుల్ (బి) అర్ష్దీప్ సింగ్ 1, బవూమ (సి) కార్తీక్ (బి) షమీ 10, రొసో (ఎల్బీ) అర్ష్దీప్ సింగ్ 0, మార్క్రమ్ (సి) సూర్య (బి) పాండ్యా 52, మిల్లర్ (నాటౌట్) 59, స్టబ్స్ (ఎల్బీ) అశ్విన్ 6, పార్నెల్ (నాటౌట్) 2, ఎక్స్ట్రాలు: 7, మొత్తం: 19.4 ఓవర్లలో 137/5. వికెట్లపతనం: 1–3, 2–3, 3–24, 4–100, 5–122. బౌలింగ్: భువనేశ్వర్ 3.4–0–21–0, అర్ష్దీప్ సింగ్ 4–0–25–2, షమీ 4–0–13–1, పాండ్యా 4–0–29–1, అశ్విన్ 4–0–43–1.
- టీ20 వరల్డ్కప్లో వెయ్యి రన్స్ మార్క్ను అందుకున్న తొలి ఇండియన్ బ్యాటర్గా కోహ్లీ రికార్డులకెక్కాడు.
- టీ20 వరల్డ్కప్ల్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన తొలి ప్లేయర్గా రోహిత్ రికార్డు సృష్టించాడు. లంక బ్యాటర్ తిలకరత్నే దిల్షాన్ (35)ను అధిగమించాడు.