లీస్టర్: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ (87 బాల్స్లో 14 ఫోర్లు, 1 సిక్సర్తో 76) ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చాడు. ఐపీఎల్తో పాటు సౌతాఫ్రికాతో టీ20 సిరీస్లో ఫెయిలైన పంత్.. రెడ్ బాల్ను దీటుగా ఎదుర్కొన్నాడు. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు సన్నాహంగా ఇండియా, లీస్టర్షైర్తో జరుగుతున్న వామప్ మ్యాచ్లో బ్యాట్ ఝుళిపించాడు. ఈ పోరులో లీస్టర్షైర్ తరఫున బరిలోకి దిగిన రిషబ్.. మన బౌలర్లనే ఎదుర్కొంటూ మెప్పించాడు. మరోవైపు ఇండియా బౌలర్లు కూడా ఆకట్టుకున్నారు. పేసర్లు మహ్మద్ షమీ (3/42), మహ్మద్ సిరాజ్ (2/46), శార్దూల్ ఠాకూర్ (2/71)తో పాటు స్పిన్నర్ జడేజా (3/28) రాణించాడు.
తొలి రోజు స్కోరు 246/8 వద్దనే ఇండియా తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేయగా.. రెండో రోజు శుక్రవారం బరిలోకి దిగిన లీస్టర్షైర్ తొలి ఇన్నింగ్స్లో 57 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. పంత్ టాప్ స్కోరర్గా నిలవగా.. చతేశ్వర్ పుజారా (0) మాత్రం డకౌటై నిరాశ పరిచాడు. అనంతరం రెండు పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్కు వచ్చిన ఇండియా రెండో రోజు చివరకు 80/1 స్కోరు చేసింది. ఓపెనర్గా బరిలోకి దిగిన శ్రీకర్ భరత్ (31 బ్యాటింగ్) ఆకట్టుకున్నాడు. శుభ్మన్ గిల్ (38) శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ప్రస్తుతం భరత్, విహారి (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
ఇటు షమీ..అటు పంత్
తొలి రోజు అంతగా ఆట్టుకోలేకపోయిన ఇండియా ప్లేయర్లు రెండో రోజు పూర్తి ఆధిపత్యం చూపెట్టారు. లీస్టర్ ఇన్నింగ్స్లో పంత్ హీరోగా నిలిస్తే.. అటు ఇండియా బౌలింగ్ను నడిపించిన షమీ తన మార్కు చూపెట్టాడు. తొలి సెషన్లో షమీ, మహ్మద్ సిరాజ్.. మంచి పేస్కు వైవిధ్యం జోడించి ఆరంభంలోనే వికెట్లు రాబట్టారు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో ఓపెనర్ ఎవాన్స్ (1)ను వెనక్కిపంపిన షమీ, తన తర్వాతి ఓవర్లోనే పుజారాను క్లీన్ బౌల్డ్ చేసి షాకిచ్చాడు. ఈ దశలో క్రీజులో కుదురుకున్న కింబర్ (31) , యివిసన్ (22)ను సిరాజ్ వెంటవెంటనే ఔట్ చేశాడు. అయితే, ఐదో నంబర్లో క్రీజులో కి వచ్చిన పంత్ మన బౌలర్లకు ఎదురు నిలిచాడు. షమీ, సిరాజ్, ఉమేశ్, శార్దూల్ బౌలింగ్ను ఈజీగా ఎదుర్కొంటూ స్వేచ్ఛగా షాట్లు కొట్టాడు.
షమీ బౌలింగ్లో 30 బాల్స్లో 26 రన్స్, సిరాజ్ బౌలింగ్లో 23 బాల్స్లో 20, ఉమేశ్ బౌలింగ్లో 12 బాల్స్లో 13 రన్స్ సాధించాడు. దూకుడుగా ఆడిన తను ఎక్స్ట్రా–కవర్ డ్రైవ్స్, ప్యాడిల్ స్వీప్స్తో అలరించాడు. రిషి పటేల్ (34), రోమన్ వాకర్ (34)తో కీలక భాగస్వామ్యాలు నిర్మించి స్కోరు 200 దాటించడంతో పాటు ఉమేశ్ బౌలింగ్తో అద్భుతమైన స్వీప్ షాట్తో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. చివరకు లెఫ్టార్మ్ స్పిన్నర్ జడేజా బౌలింగ్లో స్లాగ్స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో లాంగాన్లో క్యాచ్ ఇచ్చి ఏడో వికెట్గా వెనుదిరిగాడు. చివర్లో స్పిన్ మ్యాజిక్ చూపెట్టిన జడ్డూ.. వాకర్, నేథన్ బౌలే (5) పని పట్టాడు. అబిడైన్ (0)ను ఠాకూర్ డకౌట్ చేయడంతో లీస్టర్ ఇన్నింగ్స్ ముగిసింది.
ఓపెనర్ భరత్
అనంతరం రెండో ఇన్నింగ్స్లో కెప్టెన్ రోహిత్ తాను రాకుండా శ్రీకర్ భరత్ను ఓపెనర్గా పంపాడు. తొలి ఇన్నింగ్స్లో సూపర్ పెర్ఫామెన్స్ చేసిన భరత్.. ఈ చాన్స్నూ సద్వినియోగం చేసుకున్నాడు. 18 ఓవర్ల పాటు ఎలాంటి తడబాటు లేకుండా బ్యాటింగ్ చేశాడు. కేఎల్ రాహుల్ గైర్హాజరీలో ఓపెనింగ్ స్లాట్లో మరో ఆప్షన్ తీసుకొచ్చాడు. ఇక, తొలి ఇన్నింగ్స్తో పోలిస్తే గిల్ ఫర్వాలేదనిపించాడు. వేగంగా బ్యాటింగ్ చేసిన తను.. ఇండియన్ సైనీ బౌలింగ్లో ఔటయ్యాడు.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా తొలి ఇన్నింగ్స్: 246/8 డిక్లేర్డ్; లీస్టర్షైర్ తొలి ఇన్నింగ్స్: 57 ఓవర్లలో 244 ఆలౌట్ (పంత్ 76, షమీ3/42, జడేజా 3/28). ఇండియా రెండో ఇన్నింగ్స్: 18 ఓవర్లలో 80/1 (గిల్ 38, భరత్ 31 బ్యాటింగ్, సైనీ 1/12)