
హైదరాబాద్, వెలుగు: ఆసియా కప్ ఫైనల్లో తాను క్రీజులోకి అడుగుపెట్టినప్పుడు పాకిస్తాన్ ఆటగాళ్లు అనవసర మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా వాటికి తన బ్యాట్తోనే జవాబిచ్చానని తిలక్ వర్మ తెలిపాడు. అత్యంత ఒత్తిడితో కూడిన పరిస్థితులే తన కెరీర్లో అత్యంత కీలకమైన ఇన్నింగ్స్ఆడటానికి ప్రేరణగా నిలిచాయని చెప్పాడు.
‘నా ఆటే మాట్లాడాలని నేను అనుకున్నాను. నేను క్రీజులోకి రాగానే పాక్ ప్లేయర్లు చాలా విషయాలు మాట్లాడుతున్నారు. కానీ, నా బ్యాట్తోనే వారికి జవాబివ్వాలనుకున్నా. ఇక స్టాండ్స్లో వందేమాతరం నినాదాలు విని నాకు గూస్బంప్స్ వచ్చాయి. నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా. భారత్ మాతా కీ జై’ అని మ్యాచ్తర్వాత తిలక్ పేర్కొన్నాడు.
ఆసియా హీరోకు అపూర్వ స్వాగతం
ఆసియా కప్ ఫైనల్లో ఖతర్నాక్ ఆటతో టీమిండియాను విజేతగా నిలిపి రాష్ట్రానికి తిరిగొచ్చిన హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ కు గ్రాండ్ వెల్కం లభించింది. సోమవారం శంషాబాద్ ఎయిర్పోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున తిలక్ను రిసీవ్ చేసుకున్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండీ సోనీ బాలాదేవి ఘనంగా సత్కరించారు. క్లిష్ట పరిస్థితుల్లో జట్టును గెలిపించిన తిలక్ పోరాటం యంగ్స్టర్స్కు స్ఫూర్తిగా నిలుస్తుందని శివసేనా రెడ్డి అన్నారు.